స్వార్థం కోసం దళితులు, బీసీలు బలి, జాగ్రత్తగా ఉండండి, సీఎం సిద్దరామయ్య, బీజేపీ!
బెంగళూరు: స్వార్థపరుల రాజకీయం కోసం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, దళితులు, బీసీలు జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కొందరు రాజకీయ నాయకుల కారణంగా మతఘర్షణలు జరుగుతున్నాయని సీఎం సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఇదే సందర్బంలో బీజేపీ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.
దళితులు, బీసీలు టార్గెట్!
మంగళూరు, కోస్తా ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్లలో ఇద్దరు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, వారి కుటుంబ సభ్యులు ఎవరు ఆదుకుంటారు అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. ఎవరి కోసం ఇలాంటి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య బీజేపీని ప్రశ్నించారు.
రూ. 10 లక్షలు పరిహారం
ఇటీవల మంగళూరులో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన దీపక్ రావ్, అహమ్మద్ బషీర్ నివాసాలకు వెళ్లిన సిద్దరామయ్య వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం చెల్లిస్తామని అన్నారు. వికలాంగుడు అయిన దీపక్ రావ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు.
ఆలయంలో సిద్దరామయ్య
కర్ణాటక నవ నిర్మాణ యాత్రలో భాగంగా ఉడిపి చేరుకున్న సీఎం సిద్దరామయ్య అక్కడి దేవాలయంలో పూజలు చేశారు. తాను హిందూ వ్యతిరేకి కాదని సీఎం సిద్దరామయ్య చెప్పే ప్రయత్నాలు చేసి ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపణలు చెయ్యడంతో సీఎం దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు.
ఎస్టీల్లోకి నాలుగు కులాలు
గంగ, బెస్త, మూగవీర, కారవి మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాధన పంపించామని సీఎం సిద్దరామయ్య అన్నారు. మత్స్యకారులకు వడ్డిలేని రుణాలు ఇవ్వాలని వచ్చే బడ్జెట్ మంత్రివర్గ ఆమోదం తీసుకుంటామని సిద్దరామయ్య వివరించారు.
యువత చేతుల్లో కత్తులు!
చక్కగా విద్యాభ్యాసం చేసి డాక్టర్లు, ఇంజనీర్లు కావలసిన యువకులు చేతుల్లో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారని, సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని సీఎం సిద్దరామయ్య పరోక్షంగా బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తోందని సీఎం సిద్దరామయ్య జోస్యం చెప్పారు.