ఇదీ ప్రజల విజయం, ఎల్జీ కిరణ్ బేడీ తొలగింపుపై సీఎం నారాయణ స్వామి
పుదుచ్చేరి ఎమ్మెల్యే మాల్లాడి కృష్ణారావు రాజీనామాతో రాజకీయ ప్రకంపనలు రేగాయి. ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొంది. మెజార్టీ లేనందున నారాయణ స్వామి ప్రభుత్వానికి ముప్పు ఏర్పడింది. వాస్తవానికి వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నా.. అప్పటివరకు ప్రభుత్వం మనుగడలో ఉండాల్సి ఉంది. అయితే ఇంతలో రాష్ట్రపతి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిని బదిలీ చేశారు. రాజకీయ అస్థిరత్వం నెలకొనడంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై సీఎం నారాయణ స్వామి స్పందించారు. ఇదీ ప్రజల విజయం అని ఆయన అభివర్ణించారు.
పుదుచ్చేరిలో కిరణ్ బేడీ సమాంతరంగా ప్రభుత్వం నడిపారని నారాయణ స్వామి ఆరోపించారు. ఇప్పుడే కాదు గత నాలుగున్నరేళ్ల నుంచి ఆమెను ఎల్జీగా తొలగించాలని కోరుతున్నామని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. పలుమార్లు ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎల్జీకి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశామని చెప్పారు.
రాష్ట్రంలో ఎల్జీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. దీంతో అభివృద్ది పనులు ఆగిపోయాయని వివరించారు. కానీ ఇవాళ మాత్రం తమకు న్యాయం జరిగిందని చెప్పారు. దీంతో సంక్షేమ పనులకు ఇక ఆటంకం కలుగదని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే బేడీకి లెక్కలేదని చెప్పారు. ప్రభుత్వ పాలనలో రోజువారీగా జోక్యం చేసుకుంటారని చెప్పారు. అంతేకాదు అధికారులకు నేరుగా సలహాలు/ సూచనలు ఇస్తారని చెప్పారు. ఇదీ తాము గతంలో ఎక్కడా చూడలేదని చెప్పారు. బేడీ మాత్రం సమన్యాయ పాలనకు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపించారు.