ఎక్కడ నెగ్గుతాం..! ఎక్కడ తగ్గుతాం..!! రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ..!!
ప్రాంతీయ పార్టీలతో సహా జాతీయ పార్టీలు సైతం రాబోయే ఎన్నికల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పైపైకి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి ఓటమి భయం మాత్రం వెంటాడుతోందట. కొందరు నేతలు ఉత్కంఠను తట్టుకోలేక సర్వేలు చేయించుకుని అనుకూల ఫలితాలు వస్తాయని నిర్ధారణ ఐనప్పటికి కూడా చివరి నిమిషంలో ఏంజరుగుతుందో అనే సందేహం దహించివేస్తుందట. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి, ఏ పార్టీలకు దూరంగా ఉండలనే అంశం కూడా రాజకీయ నాయకులను కలవరానికి గురిచేస్తుందట. జాతీయ స్థాయి నుండి ప్రాంతీయ పార్టీల వరకు ఎవరి ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
ఢిల్లీ నుంచి గల్లీ దాక అదే బెంగ..! పబ్లిక్ పల్స్ పట్టుకోలేకపోతున్న నాయకులు..!
జాతీయపార్టీల్లోనే కాదు.. ప్రాంతీయపార్టీల్లో నూ ఇదే బెంగ. బలపడ్డామా.. బలహీనమయ్యామా అనే అంచనా వేసుకునే సాహసం కూడా చేయలేకపోతున్నారు నేతలు. పైగా ఎవరో ఒకరు పక్కన లేకపోతే.. బలమైన మరో పార్టీ అండ లేకపోతే.. గెలవలేమనే భావనలో ఉన్నట్లున్నాయి. ముఖ్యంగా పైకి గంబీరంగా చెబుతున్న అధికార ఎన్డీఏ, టీఆర్ఎస్, టీడీపీల్లోనూ ఇదే భావన నెలకొందనేది నేతల మాటల్లో బయటపడుతూనే ఉంది. అయితే.. ఇదంతా బయటకు చెబితే.. పరువుపోతుందనే భయం.. కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనే ఆలోచన కూడా పార్టీలను మేకపోతు గాంబీర్యం ప్రదర్శించేలా చేస్తున్నాయి.
ఉత్కంఠకు గురౌతున్న నేతలు..! గెలుపుపై ధీమా కరువు..!
రాజకీయాల్లో ఏదో జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతటి రాజకీయ శూన్యత నెలకొంది. దీనికి సమాధానం.. బీజేపీపై ప్రజల్లో అపారమైన విశ్వాసమా.. ప్రస్తుత పాలకులపై నెలకొన్న నిస్తేజమా ! అనేది చెప్పటం కష్టంగా మారింది. ఎందుకంటే.. ఉత్తర, దక్షిణాధి రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు.. ఒకవేళ మమత, అఖిలేష్, రాహుల్, చంద్రబాబు, కేసీఆర్, దేవెగౌడ ఇలా చెబుతూ పోతే.. ఎవరు ఎవరితో సయోధ్యగా ఉంటారనేది చెప్పటం కూడా కష్టమే.
ప్రజాదరణ ఉందన్న నేతల్లో కూడా అయోమయం..! భరోసా ఇవ్వలేక పోతున్న సర్వేలు..!!
అందరిలో 2019 ఎన్నికల్లో నెగ్గితీరాలనే పట్టుదల మాత్రం రెట్టింపవుతోంది. తాము బలపడ్డామని.. ప్రత్యర్థి బలహీనపడ్డాడని భావిస్తున్నపార్టీలు.. భావించే నేతలు కూడా.. ఒక అంచనాకు రాలేకపోతున్నారు. జమిలీ అంటూ.. మోదీ ప్రకటించినా.. పైకి సరే అంటున్న నేతలు లోలోన భయపడతున్నారు. వాస్తవానికి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు గెలుపుకాదు. పైగా.. ఇది.. బీజేపీ బలాన్ని.. హస్తం బలహీనతలను చెప్పకనే చెప్పింది. ఇదే సమయంలో మూడో కూటమికి కలసివచ్చే నేతలు.. ప్రాంతీయ పార్టీల్లో అందోళన బయట పడినట్లుగా ప్రపంచం తెలుసుకోగలిగింది. ఎన్డీఏకు ధీటుగా యూపీఏ కూటమిని బలపరచాలంటూ సోనియా వ్యూహ రచన చేసేపనిలో పడ్డారు.
బలపడుతున్న విపక్షాలు.. బెంబేలెత్తుతున్న అదికార పక్షాలు..!
ఇదే సమయంలో మాజీ పీఎం దేవెగౌడ మరో బాంబు పేల్చారు. తనకు మమతాబెనర్జీ ప్రధానమంత్రి కావాలని ఉందంటూ.. మనసులో మాట బయటపెట్టాడు. రాహుల్ను ప్రధాని చేయాలనుకుంటున్న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ.. ఆ పదవిమరోకరు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా అనేది కూడా చర్చనీయాంశం. దీంతో మూడోకూటమి తప్పనిసరి కానుంది. ఈ లెక్కన.. యూపీఏ, ఎన్డీఏతోపాటుగా.. మరో రెండు కూటమిలు.. తెరమీదకు రాబోతున్నాయన్నమాట. ఇంత రాజకీయడ్రామాల్లో ఒంటరిగా వెళ్లాలా.. పొత్తు ఎవరితో పెట్టుకోవాలనేది దాదాపు అన్ని పార్టీల్లో నెలకొన్న సందిగ్థత అనేది నిర్వివాదాంశం గా మారింది.