భారత్ మాతా కీ జై: హనుమాన్ కీ థ్యాంక్స్: అరవింద్ కేజ్రీవాల్ విజయ ప్రసంగం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు విజయాన్నందించిన భగవాన్ హనుమాన్కు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా చేరుకున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసగించారు.
భారత్ మాతా కీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్. ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం అని నినాదాలు చేశారు. భగవాన్ హనుమాన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు తనను ఆశీర్వదించారని ఆయన వ్యాఖ్యానించారు.
భగవాన్ హనుమాన్ రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఐదేళ్లు కూడా సరైన మార్గంలో ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని తాము భగవాన్ హనుమాన్ను కోరుకున్నామని.. ఆయన తమను అలాగే దీవించారని కేజ్రీవాల్ తెలిపారు. దీంతో అక్కడున్న అనుచరలంతా కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఐ లవ్యూ అంటూ ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 62 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. వాటిలో ఇప్పటికే 36 స్థానాల్లో గెలుపును నమోదు చేసింది. ఇక బీజేపీ 7 స్థానాల్లో గెలుపొందింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంద.ి
కాగా, ఎన్నికల ప్రచార సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తాను హనుమాన్ భక్తుడినని చెప్పుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఓ టీవీ కార్యక్రమంలో ఆయన హనుమాన్ చాలీసా కూడా పఠించారు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది.
అయితే, ఈ వీడియోపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. హనుమాన్ చాలీసాను అరవింద్ కేజ్రీవాల్ పఠించడం మొదలు పెట్టారని.. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పఠించాల్సిన సమయం దగ్గరలోనే ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
AAP chief Arvind Kejriwal: This is the day of Lord Hanuman who has blessed the people of Delhi. We pray that Hanuman Ji keeps showing the right path to us so that we continue to serve people for the next five years. #DelhiElectionResults pic.twitter.com/sXA2nA27uo
— ANI (@ANI) February 11, 2020
కాగా, ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఓ హనుమాన్ దేవాలయానికి వెళ్లారు. అయితే, దేవుడి విగ్రహాన్ని చేతులు శుభ్రం చేసుకోకుండా తాకడంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మండిపడ్డారు. దీంతో తాను హనుమాన్ చాలీసా చదివిన నాటి నుంచి బీజేపీ నేతలు తనను లక్ష్యంగా చేసుకున్నారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.