జయ వీడియో ఇప్పుడా: శశికళపై కేతిరెడ్డి షాకింగ్ కామెంట్స్, చిన్నమ్మ కొత్త పాచిక
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో అంటూ దినకరన్ వర్గం ఎమ్మెల్యే వేట్రివెల్ సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు తెలుగు సేన నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు.
జయలలిత మరణించి ఏడాది గడుస్తోందని, ఇప్పుడు ఈ వీడియోను విడుదల చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకే దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందని ఆరోపించారు.
తమిళనాట సంచలనం: 'జయ వీడియో తీసిందే శశికళ', ఈసీ ఆగ్రహం
కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2012లోనే జయలలితపై శశికళ విషప్రయోగం చేసిందనే ఆరోపణలు వచ్చాయని చెప్పారు. జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎవరినీ లోనికి అనుమతించలేదన్నారు.
కుట్రతో చంపిందనే ఆరోపణలు
జయలలితను శశికళ కుట్రపూరితంగా చంపించిందనే ఆరోపణలు ఉన్నాయని కేతిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఓట్ల కోసమే ఇలాంటి వీడియోను విడుదల చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అందుకే కొత్తరకం పాచిక
ఎన్నికల సమయంలో డబ్బులు పంచకుండా దినకరన్ వర్గాన్ని ఎన్నికల అధికారులు వారించడంతో వారు కొత్త రకం పాచిక వేశారని కేతిరెడ్డి విమర్శించారు. ఆసుపత్రిలో జయలలిత ఉన్న గదిలో సీసీటీవీ ఫుటేజీ లేదని అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు.
ఫుటేజీ లేదన్నారు
జయలలిత ఉన్న గదిలో సిసిటీవీ ఫుటేజీ లేనప్పుడు వీడియో ఎలా వచ్చిందని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఈ వీడియోను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆడే నాటకంలో ఇది ఒక భాగం అన్నారు. వీడియోను విడుదల చేసి దినకరన్ వర్గం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందన్నారు.