సేవాగ్రామ్ ఆశ్రమంలో ప్లేట్లు కడిగిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
గురుగ్రామ్: మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా మహారాష్ట్ర వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లు తమ తమ ప్లేట్లు తామే స్వయంగా కడుక్కున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
లంచ్ చేసిన అనంతరం సోనియా, రాహుల్ ఆశ్రమంలో ఉన్న నల్లాల వద్దకు వచ్చి తమ కంచాలను కడిగారు. వారితో పాటు ఆశ్రమంలో భోజనం చేసిన ప్రతి ఒక్కరూ అలాగే చేశారు. ఈ ప్రార్థనా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్, పుదుచ్చేరి సీఎం వి నారాయణ స్వామి, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, హర్యానా మాజీ సీఎం హూడా, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, కేంద్ర మాజీ మంత్రులు పాల్గొన్నారు.
ఈ ఆశ్రమంలో 1986లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఓ మొక్కను నాటారు. ఈ రోజు ఆ చెట్టు పక్కనే రాహుల్ గాంధీ ఓ మొక్కను నాటారు. ఆయన ఈ ఆశ్రమాన్ని సందర్శించడం ఇది రెండో సారి. 2014 జనవరిలో ఆయన మొదటిసారి ఆశ్రమానికి వచ్చారు.
మహాత్ముడి హత్యకు దారితీసిన ద్వేషం, హింసకు వ్యతిరేకంగా రెండో స్వాతంత్ర్య పోరాటానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా వార్దాలో సీడబ్ల్యుసీ సమావేశం జరిగింది. 76 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మళ్లీ వార్దాలో జరగడం ఇదే తొలిసారి అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
#WATCH: Sonia Gandhi and Rahul Gandhi wash their plates after lunch in Sevagram (Bapu Kuti) in Wardha. #Maharashtra pic.twitter.com/hzC3AGe7kj
— ANI (@ANI) October 2, 2018
1942 జులై 14న మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీ గాంధీ ప్రతిపాదించిన క్విట్ ఇండియా ఉద్యమానికి ఆమోద ముద్ర వేసింది. 1942 ఆగస్ట్ 8న క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. మరోవైపు తమ సమస్యల సాధన కోసం ఢిల్లీకి పాదయాత్రగా చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకోవడాన్ని సీడబ్ల్యూసీ ఖండించింది.