హవ్వ.. మోడీ ఎదుటే.. మహిళా మంత్రి నడుముపై..! (వీడియో)
Recommended Video
అగర్తల : అతనో మంత్రి. ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసిన వేదికపైకి ఎక్కారు. సాటి మహిళ మంత్రితో అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపురలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు లెఫ్ట్ పార్టీలు వర్సెస్ బీజేపీ వార్ పీక్ స్టీజ్కు వెళ్లింది. మంత్రి అసభ్యకర ప్రవర్తన టార్గెట్ గా లెఫ్ట్ పార్టీలు బీజేపీని చెడుగుడు ఆడుతున్నాయి. మరోవైపు వామపక్షాలకు చెత్తరాజకీయాలు తప్ప మరొకటి తెలియదని కమలనాథులు మండిపడుతున్నారు.
వేదికపై మినిస్టర్ మనోజ్ కాంతి దేవ్
బీజేపీ మరో ఇరకాటంలో పడింది. త్రిపుర మంత్రి చేసిన పని ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. త్రిపురలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న వేదికపై మినిస్టర్ మనోజ్ కాంతి దేవ్ చేసిన పని బీజేపీకి కష్టాలు తెచ్చిపెట్టింది. త్రిపుర మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న సాంతనా చక్మాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె నడుము మీద చేయి వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్ కాంతి దేవ్ ప్రవర్తనకు ఇబ్బంది పడ్డ సదరు మహిళా మంత్రి ఆయన చేయిని వెనక్కినెట్టారు. ఎదుట ప్రధాని, ఇతర మంత్రులు, అధికారులు, స్టేజీ కింద వేలాది మంది ప్రజలు.. ఇలా అంతమంది ఉన్నా కూడా మంత్రి మనోజ్ కాంతి దేవ్ బరితెగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాంతి దేవ్ ప్రవర్తించిన తీరును
మహిళా మంత్రి పట్ల మనోజ్ కాంతి దేవ్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. ఆదివాసీ యువనేతగా ఉన్న సాంతనా చక్మా పట్ల మనోజ్ కాంతి దేవ్ ప్రవర్తించిన తీరును లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ బిజన్ ధార్ ఖండించారు. మంత్రి మనోజ్ కాంతి దేవ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సభ్యత, సంస్కారం లేని మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని కోరారు. ఈ విషయంలో త్రిపుర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షమైన లెఫ్ట్ ఫ్రంట్ చెడుగుడు ఆడుతోంది.
మహిళా మంత్రితో పబ్లిక్ గా
ఓవైపు ప్రధాని, మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వేదికపై ఉన్న సమయంలో మంత్రి మనోజ్ కాంతి దేవ్ చేసిన పని.. బీజేపీకి తలనొప్పిలా పరిణమించింది. మహిళా మంత్రితో పబ్లిక్ గా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో ఇంతలా బరితెగిస్తారా? అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అధికార బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. మహిళా మంత్రి ఎలాంటి ఫిర్యాదు చేయలేదంటోంది. లెఫ్ట్ పార్టీలు చెత్త రాజకీయాలు చేస్తున్నాయంటూ బీజేపీ నేత నబెందు భట్టాచార్జీ ఆరోపించారు. మొత్తానికి మనోజ్ కాంతి దేవ్ చేసిన పని లెఫ్ట్, బీజేపీల మధ్య మరింత దుమారం రేపింది.