నిర్లక్ష్యం: విరిగిన రైలు పట్టాను బట్టతో కట్టారు...వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు గోవండి మన్కుర్ద్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ రెండుగా చీలింది. దీనికి అరగంటలో మరమత్తులు చేసింది సిబ్బంది. అయితే అంతలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చీలిన ఆ పట్టాను ఓ పాత బట్టతో కట్టడం ఆ వీడియోలో ఉంది.
ఈ వీడియో వైరల్ అవడంతో రైల్వే అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. విరిగిన ఆ పట్టా దగ్గర మార్కర్ కోసమే ఆ బట్టను చుట్టామని చీలిన బాగాన్ని కలిపేందుకు కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఫిష్ ప్లేట్ విరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పిన అధికారులు... దాన్ని మరమత్తు చేసేందుకు ముందుగా మార్క్ చేసుకుంటామని అది పెయింట్తో మార్క్ చేసుకుంటామని చెప్పారు. అయితే భారీగా కురుస్తున్న వర్షాలకు పెయింట్ తుడుచుపెట్టుకుపోతుంది కనుక పెయింట్ స్థానంలో మార్కర్లా బట్టను చుట్టామే తప్ప.... రెండుగా చీలిన పట్టాని కలిపేందుకు బట్టను చుట్టలేదని వివరణ ఇచ్చారు.
మరోవైపు రైల్వే భద్రత, ప్రయాణికుల భద్రతపై రైల్వే కమిషనర్చే ఎంక్వైరీ వేయాలని ఆర్టీఐ యాక్టివిస్టు సమీర్ జవేరీ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు రైల్వే ట్రాక్ పైకి వచ్చి చేరుతుండటంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.