వైరల్ : జోలపాటలా నిర్మలా సీతారామన్ ప్రసంగం..కునుకు తీసిన మంత్రులు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉంది తప్ప ఆర్థికమాండ్యం లేదని పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడిన నిర్మలా సీతారామన్ విమర్శకులను, విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. అయితే నిర్మలా సీతారామన్ ప్రసంగం ఒక జోలపాటలా సాగింది తప్ప ఎంపీలను ఆకట్టుకొనలేదు. ఇందకు నిదర్శనం నిండు సభలో ఒక మంత్రి కీలకమైన అంశంపై మాట్లాడుతుండగా ఆమె వెనకాలే కూర్చున్న మిగతా కేంద్రమంత్రులు నిద్రపోతూ కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజెన్లకు పనిచెప్పాయి.
మందగమనమే.. ఆర్థిక మాంద్యం లేదు, ఉండబోదు: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
సభలో నిర్మలా ప్రసంగం.. నిద్రపోయిన మంత్రులు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థపై రాజ్యసభలో ప్రసంగిస్తుండగా పలువురు కేంద్రమంత్రులు ఎంపీలు నిద్రపోతూ కనిపించారు. ఆమె ప్రసంగం వారికి జోలపాటలా ఉన్నిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సమస్యలపై మాట్లాడమని ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే వారు గుర్రపెట్టి నిద్రపోతున్నారని కొందరు నెటిజెన్లు కామెంట్ చేశారు.
సభలో కునుకు తీసిన మంత్రి మహేంద్రనాథ్
ఇక నిర్మలా సీతారామన్ సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న సమయంలో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే గుర్రపెడుతూ నిద్రపోతున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఇది గమనించిన మరొక ఎంపీ వెనకాల నుంచి ఆయను తడుతూ నిద్ర లేపుతున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఇది చూసిన సాటి మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆకట్టుకోలేకపోయిన నిర్మలా ప్రసంగం
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి నిర్మలా సీతారామన్ సభలో వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్న విధానాపరమైన నిర్ణయాలు తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పోలుస్తూ ప్రసంగించారు. తాను ఆర్థిక మంత్రిగా ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్లోని అంశాలు అమలు చేస్తున్నామని ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె రాజ్యసభకు తెలిపారు. ఇన్ని చెబుతున్నప్పటికీ సభలో కూర్చున్న ఎంపీలు కానీ మంత్రులను కానీ ఆకట్టుకోలేకపోయారు. బల్లలు చరచడం మానీ నిదానంగా నిద్రలోకి జారుకున్నారు. రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ప్రసంగం సాగుతుండగా చాలామంది ఎంపీలు నిద్రపోవడం సభలోని అధికారులు గమనించినట్లు ఓ జాతీయ వార్తా ఏజెన్సీ తన కథనంలో ప్రచురించింది.
సహచర మంత్రులను నిద్రలేపిన అనురాగ్ ఠాకూర్
ముందుగా రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభించగానే ఒక ఎంపీ నిద్రలోకి జారుకున్నారు. ప్రసంగం సాగిస్తుండగా మరో ఎంపీ కునుకు తీశారు. ఆ తర్వాత ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా నిద్రపోవడం కనిపించింది. అయితే ఆయన తేరుకుని తన పక్కనే నిద్రలోకి జారుకున్న మరో ఇద్దరిని నిద్రలేపడం కనిపించింది. ఇప్పుడు ఇవే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజెన్లు జోకులు పేలుస్తున్నారు.