శశికళ సీఎం ఎందుకు కాలేదంటే: క్లారిటీ ఇచ్చిన విద్యాసాగర రావు
తమిళనాడు రాజకీయాల్లో తాను ఆచితూచీ ముందుకు అడుగులు వేశానని ఆ రాష్ట్ర మాజీ ఇన్ చార్జ్ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అంటున్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తాను ఆచితూచీ ముందుకు అడుగులు వేశానని ఆ రాష్ట్ర మాజీ ఇన్ చార్జ్ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అంటున్నారు. జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన తన మనోగతాలను పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు.
తమిళనాడు ప్రభుత్వ శాసన సభ పక్షనేతగా శశికళ ఎన్నికైన తరువాత ఆమెతో ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించలేదు అనే విషయంలో సీహెచ్. విద్యాసాగర్ రావు దోస్ ఈవెంట్ ఫుల్ డేస్ పుస్తకంలో వివరించారు. శశికళ ముఖ్యమంత్రి అయితే తమిళనాడు చరిత్రకే ఒక మచ్చ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో శశికళ మీద తీర్పు ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నందున తాను న్యాయనిపుణులతో ఎప్పటికప్పుడు చర్చించి ఆలస్యం చేశానని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు వివరించారు.
తొందరపడి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి చేసి ఉంటే రెండు మూడు రోజుల్లో ఆమె రాజీనామా చేసి జైలుకు వెళ్లేవారని, అదే జరిగితే తమిళనాడు చరిత్రకే ఒక మచ్చగా మిగిలి ఉండేదని సీహెచ్. విద్యాసాగర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. శశికళ విషయంలో అందుకే ఆచితూచీ ముందుకు అడుగులు వేశానని సీహెచ్. విద్యాసాగర్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.