కోట్లకు పడగలెత్తాడు: జడ్జి వారెంట్తో విజిలెన్స్ దాడులు
భవానీపట్న: ఆదాయానికి మించి ఆస్తులున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నివాసంపై విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోటి రూపాయలకు పైగా అక్రమంగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే... కలహండి జిల్లా భవానీపట్న ఫారెస్ట్ రేంజర్గా ప్రసన్న కుమార్ మిశ్రా పని చేస్తున్నారు.
మిశ్రా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో భవానీపట్న విజిలెన్స్ ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన సెర్చ్ వారెంట్తో మంగళవారం ప్రసన్నకుమార్ ఇల్లు, ఆఫీస్పై విజిలెన్స్ డీఎస్పీ అనంత కుమార్ మాంఝీ నేతృత్వంలోని అధికారులు దాడులు చేశారు.
భవానీపట్న ఇరిగేషన్ కాలనీలో గల ప్రసన్న కుమార్ మామగారి ఇల్లు, భవానీపట్నలోని హిల్పట్నలో గల అతని నివాసంతో పాటు స్వగ్రామమైన పరియగాంలో, కార్యాలయంపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు రూ.1,21,14,095 విలువగల స్థిర చరాస్తులు ఉన్నట్లు గుర్తించారు.
దీంతో పాటు భవానీపట్న హిల్టౌన్లో రూ.38,56,398 విలువ గల 3037 చదరపు అడుగుల వైశాల్యంలో రెండంతస్తుల భవనం, హవాణిపట ఝునాగడ్, రాయగడలలో రూ.15 లక్షల విలువైన ఆరు ప్లాట్లు ఉన్నాయని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి.
కాగా, ప్రసన్నకుమార్, ఆయన భార్య, మామ పేరుతో బ్యాంకుల్లో రూ.46,87,724 నగదు ఉందని, ఎల్ఐసీ, ఇతర బీమా కంపెనీల్లో రూ. 8,55,000 డిపాజిట్లు, రూ.6,92,953 బంగారు నగలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ అనంత కుమార్ మాంఝీ తెలిపారు.
రూ.4,16,750 విలువ చేసే గృహ పరికరాలు, ఇంటిలో రూ.62,080 నగదు, రూ.45 వేల విలువగల హోండా మోటార్ సైకిల్ ఉన్నాయని తెలిపారు. మొత్తం 1,21,14,905 విలువైన స్థిరచరాస్తులను గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
1989లో విలేజ్ ఫారెస్ట్ వర్కర్గా ప్రసన్న కుమార్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. 1998లో కలహిండి జిల్లాలోని భవానీపట్న, కె. గాన్ ప్రాంతాలకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిలోనే కొనసాగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.