1971 Indo-Pakistan war: 93 వేల మందితో మోకరిల్లిన నియాజీ: అమర వీరులకు ప్రధాని నివాళి
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య 1971లో చోటు చేసుకున్న యుద్ధానికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం ముగిసిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీని విజయ్ దివస్గా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ యుద్ధం అనంతరం భారత్.. పాకిస్తాన్ అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్కు విముక్తిని కల్పించింది. దేశ రాజధానిలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జ్యోతి ప్రజ్వలన చేశారు. అమర వీరులకు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం స్వర్ణిమ విజయ బావుటాను వెలిగించారు.
ఈ ఉదయం యుద్ధ స్మారక చిహ్నం వద్దకు చేరుకున్న ప్రధానికి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, త్రివిధ దళాలకు చెందిన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం 1971 ఇండో-పాక్ల మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్ల సేవలను గుర్తు చేసుకున్నారు. సంఘీభావంగా స్వర్ణిమ విజయ బావుటాను ఆయన వెలిగించారు. విజయబావుటాను 1971 యుద్ధం నాటి పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర పురస్కార గ్రహీతల గ్రామాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.
1971 నాటి భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది స్వర్ణిమ విజయ సంవత్సరంగా పేర్కొంది రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే డిసెంబర్ 16వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విముక్తి కల్పించడానికి భారత్ 1971 డిసెంబర్ 3వ తేదీన యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం 16వ తేదీన ముగిసింది. ఓటమికి సంకేతంగా అప్పటి పాకిస్తాన్ సైన్యాధికారి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ.. 93 వేల ట్రూప్స్తో భారత ఆర్మీ వద్ద లొంగిపోయారు.
ఈ యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ ఘన విజయాన్ని సాధించింది. తూర్పు పాకిస్తాన్కు విముక్తి కల్పించింది. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. విజయ్ దివస్ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత రాహుల్ గాంధీ.. సైనికులు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు నెటిజన్లు నాటి యుద్ధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.