మాల్యాకు మరో దెబ్బ: జీఎమ్మార్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
హైదరాబాద్: పారిశ్రామికవేత్త, కింగ్ఫిషర్ అధినేత విజయ్మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగలింది. మాల్యాపై నమోదైన చెల్లని చెక్కు కేసు రుజువైంది. దీంతో అతడ్ని హైదరాబాద్లోని హైకోర్టు కోర్టు దోషిగా తేల్చింది.
రూ.50 లక్షల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులు చెల్లకపోవడంపై 'జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్' పెట్టిన కేసులో నేరం రుజువైనట్లు ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది.
శిక్షను ఖరారుచేసే ముందు నిందితుడు తన అభ్యర్థనను చెప్పుకోవడానికి వీలుగా హాజరుపరచాలంటూ విజయ్మాల్యాకు కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ను జారీచేసింది. మే 5న కోర్టు ముందు విజయ్మాల్యాను హాజరుపరచాలనీ, అదేరోజు శిక్షను ఖరారు చేస్తామని మూడవ ప్రత్యేక మేజిస్ట్రేట్ ఎం కృష్ణారావు ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్లోని జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకుగాను కింగ్ఫిషర్ రూ.25 కోట్ల దాకా బకాయి పడిందని జీఎంఆర్ తరఫు న్యాయవాది జి అశోక్రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
ఈ మొత్తానికి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో మొదట్లో కేసు దాఖలు చేశామని, రాజీ మార్గంలో రూ.22 కోట్లు చెల్లించడానికి కింగ్ఫిషర్ అంగీకరించిందని తెలిపారు. దీంతో విజయ్మాల్యాపై పెట్టిన కేసులను అప్పట్లో ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కానీ, రూ.22 కోట్ల నిమిత్తం ఇచ్చిన దాదాపు 45 చెక్కులు బ్యాంకుల్లో చెల్లకుండా పోవడంతో మళ్లీ కేసులు దాఖలుచేసినట్లు వివరించారు.