విదేశాలకు డబ్బలు తరలించిన విజయ్ మాల్యా
న్యూఢిల్లీ: కింగర్ ఫిషర్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చాల కాలం క్రిమతే తాను తీసుకున్న రుణం డబ్బును విదేశాలకు తరలించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి.
బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా రూ. 9,000 కోట్లకు పైగా రుణం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ రుణాలు మొత్తం ఆయనకు సంబంధించిన కంపెనీల పేరుతోనే తీసుకున్నారు. రుణం తీసుకున్న డబ్బులు కంపెనీ అవసరాల కోసం కాకుండా విదేశాలకు తరలించారని ఈడీ వర్గాలు అంటున్నాయి.
ఈడీ కేసులు నమోదు చెయ్యడంతో విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారు. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు చెందిన కంపెనీలకు రుణం మంజూరు చేసిన బ్యాంకులు రెండు రోజుల్లో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం డాక్యుమెంట్లు జారీ చెయ్యాలని సూచించారు. ఐడీబీఐ బ్యాంకుతో సహ మొత్తం 17 బ్యాంకులకు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు చెందిన కంపెనీకి ఐడీబీఐ బ్యాంకు రూ. 900 కోట్లు మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆరు మంది ఐడీబీఐ బ్యాంకు అధికారులకు సమన్లు జారీ చేశారు.
విజయ్ మాల్యా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను భారత్ వదిలి పారిపోలేదని, ఏ తప్పు చెయ్యని తాను ఎందుకు భయపడుతానని అన్నారు. ఓ స్నేహితుడితో కలిసి తాను వ్యక్తిగత పని మీద విదేశాలకు వెళ్లానని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అంటున్నారు. అయితే ఆయన గారు ఎప్పుడు భారత్ వస్తారో అని బ్యాంకుల యాజమాన్యం ఎదురు చూస్తున్నది.