ఆస్తులు జఫ్తు చేసినా, మాల్యా భారత్ రావాల్సిందే: ఈడీ
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాకు చెందిన ఆస్తులను ఆటాచ్ చేసినప్పటికీ ఆయన భారత్ రావాల్సిన ఆవశ్యకత ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. రూ.9వేల కోట్లకు పైగా రుణాలు విజయ్ మాల్యా ఎగ్గొట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత దేశంలోని విజయ మాల్యాకు చెందిన ఆస్తులను అటాచ్ చేయాలని భావిస్తున్నారు. దీనిపై ఈడీ అధికారులు స్పందిస్తూ.. ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ.. విచారణలో భాగంగా విజయ మాల్యా భారత్ రావాలసి ఉంటుందంటున్నారు.
కేవలం ఆయనకు చెందిన డబ్బులను రికవరీ చేయడంతోనే కేసు పూర్తి కాదన్నారు. నిధులను రికవరీ చేశాక... మనీలాండరింగ్ విషయమై విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
విజయ మాల్యాకు చెందిన ఆస్తుల అటాచ్ ప్రక్రియ ప్రారంభమయిందని చెబుతున్నారు. ఆయన ఆస్తుల చిట్టా జాబితాను రూపొందిస్తున్నామని, ఆ తర్వాత అటాచ్ పూర్తవుతుందని తెలిపారు.
మాల్యా ఆస్తులను జఫ్తు చేయడం విచారణలో ఓ భాగం మాత్రమేనని చెప్పారు. ఆయనను విచారించవలసి ఉంటుందన్నారు. అందుకోసం ఆయనను కచ్చితంగా భారత్ రప్పించవలసి ఉందన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు అని చెప్పారు.
తీర్పు చెప్పలేం, మాల్యా హాజరు తప్పనిసరి: జీఎమ్మార్ కేసులో కోర్టు
అదే విధంగా మాల్యాను విచారించడంతోనే సరిపోదంటున్నారు. మాల్యాతో పాటు బ్యాంకు అధికారుల పాత్ర కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. తాము మాల్యాతో పాటు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత కేసు పురోగతిని సుప్రీం కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు.