మాల్యా ఖరీదైన రాజీనామా: విలువ రూ. 515 కోట్లు
బెంగుళూరు: భారత్లో విలాసవంతమైన, బాగా ఎంజాయ్ చేసే పారిశ్రామికవేత్తలో విజయ్ మాల్యా ఒకరు. అలాంటి విజయ్ మాల్యా ఇకపై ఇండియాలో ఉండనని, బ్రిటన్కు వెళ్లిపోతున్నానని యునైటెడ్ స్పిరిట్స్ ఛైర్మన్ పదవికి విజయ్ మాల్యా రాజీనామా చేసిన అనంతరం చెప్పిన మాటలివి.
విజయ్ మాల్యా ఏర్పాటు యూఎస్ఎల్ అనే కంపెనీ ప్రస్తుతం లండన్కు చెందిన డియాజియోకు అమ్మెశారు. సంస్థనైతే అమ్మేశారు కాని, ఆ సంస్థ చైర్మన్ పదవి నుంచి దిగిపోయేందుకు మాత్రం మాల్యా ససేమిరా అన్నారు. దీంతో అసలే నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేశామని డియాజియో బాధపడింది.
అంతేకాదు మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్కు చెందిన ఇతర సంస్థలకు నిధులు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో యునైటెడ్ స్పిరిట్స్ ఛైర్మన్, డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని గతేడాదే డియాజియో అడిగింది.
అయితే ఇందుకు విజయ్ మాల్యా ఆ సమయంలో తిరస్కరించారు. ఇప్పుడు మాల్యా యూఎస్ఎల్ చైర్మన్ పదవి నుంచి నిన్న తప్పుకున్నారు. మరోవైపు మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాల్యాతో పాటు యునైటెడ్ బ్రూవరీస్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
నిన్నటిదాకా పదవి నుంచి దిగేది లేదని తేల్చిచెప్పిన మాల్యా, అంత త్వరగా డియాజియోకు అనుకూలంగా వ్యవహరించడం వెనుక ఖరీదైన ‘డీల్' ఉందట. కంపెనీ చైర్మన్ పదవి నుంచి దిగిపోయేందుకు మాల్యాకు డియాజియో ఏకంగా రూ.515 కోట్లను ముట్టజెప్పిందంట.
అంతేకాదు, చైర్మన్ గా దిగిపోయిన ఆయనను ఇకపై కంపెనీ ‘చైర్మన్ ఎమెరిటస్'గా కొనసాగించేందుకు ఒప్పుకుంది. తన రాజీనామాపై ‘ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. డియాజియోతో ఉన్న సంబంధం ముగిసింది. తదనుగుణంగానే తక్షణం నా పదవికి రాజీనామా చేస్తున్నాన'ని మాల్యా ఒక ప్రకటనలో తెలిపారు.
తన భవిష్యత్ కార్యచరణపై మాల్యా మాట్లాడుతూ తనకు 60 ఏళ్లు వచ్చేశాయి. పిల్లలకు దగ్గరగా ఇంగ్లండ్లో మరింత సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు చీఫ్ మెంటర్గా ఉంటానని చెప్పారు. తన కుమారుడు సిద్ధార్ధ డైరెక్టర్గా కొనసాగుతారని అన్నారు.