మాల్యాను మించిపోయిన మోడీ! ఫ్యామిలీతో సహా జంప్, స్విట్జర్లాండ్లో ఉన్నాడా?
ముంబై: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను మించిపోయాడు సెలబ్రిటీ డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన మాల్యాను ఘరానా మోసగాడిగా భావిస్తుంటే.. అతడ్ని మించిన ఘనాపాఠీని నేనంటూ తెరమీదికొచ్చాడు.
Recommended Video
చదవండి: పీఎన్బీ స్కాం ఇలా బయటపడింది.. కుప్పకూలిన బ్యాంక్ షేరు, ఇక ఇప్పుడేం జరుగుతుంది?
చదవండి: గుర్తించలేకపోవడం మా తప్పే.. ఒప్పుకుంటాం: పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా
ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కాంకు పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.11,4000 కోట్ల మేర టోపీ పెట్టాడు. ఈ మోసపూరిత లావాదేవాలను గుర్తించిన బ్యాంకు అటు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొనడమేకాక ఇటు సీబీఐకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
బ్యాంకు అధికారులతో కుమ్మక్కై...
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కాంపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటు సీబీఐ, ఈడీ, అటు సెబీ కూడా దీనిపై దృష్టిసారించాయి. ముంబైలోని బ్యాంకు శాఖకు చెందిన కొంతమంది అధికారులతో కలిసి నీరవ్ మోడీ ఈ స్కాంకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన వెంటనే బ్యాంకు ఉన్నతధికారులు సదరు అవినీతి అధికారులను సస్పెండ్ చేశారు. అక్రమంగా బ్యాంకు నుంచి అండర్ టేకింగ్ లెటర్లు సంపాదించి వాటిని విదేశాల్లో సొమ్ము చేసుకోవడంతో బ్యాంకుకు రూ.11,400 కోట్ల మేర శఠగోపం పెట్టినట్లయింది.
మాల్యానే మించిపోయాడు...
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను మరిపిస్తున్నాడు నీరవ్ మోడీ. విజయ్ మాల్యా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేక దేశీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. 2016 మార్చి నెలలో చాలా బ్యాంకులు మాల్యా విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయినా సరే విజయ్ మాల్యా లండన్ పారిపోయాడు. అరెస్టయి, బెయిల్పై విడుదలై ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. తాజాగా డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీ కూడా మాల్యా బాటనే ఎన్నుకున్నాడు. ఈ నేపథ్యంలో డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీకి చెందిన కార్యాలయాలు, షోరూంలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు జరిపారు. ముంబై, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థల అధికారులు తమ సోదాలు కొనసాగిస్తున్నారు.
మాల్యా తరహాలోనే విదేశాలకు...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు భారీగా శఠగోపం పెట్టిన నీరవ్ మోడీ కూడా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మాదిరిగానే తాను కూడా విదేశాలకు చెక్కేశాడు. అయితే ఇక్కడ విజయ్ మాల్యాకు, నీరవ్ మోడీకి కాస్త తేడా ఉంది. విజయ్ మల్యా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేక విదేశాలకు చెక్కేస్తే.. నీరవ్ మోడీ తెలివిగా బ్యాంకును బురిడీ కొట్టించి విదేశానికి వెళ్లిపోయాడు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతడి సోదరుడు బెల్జియం పౌరసత్వం కలిగిన నిషాల్ జనవరి 1నే విదేశాలకు పారిపోగా, ఈ స్కాంలో మరో నిందితుడైన మెహుల్ చోక్సీ జనవరి 4న, నీరవ్ మోడీ భార్య, అమెరికా పౌరసత్వం కలిగిన అమీ జనవరి 6న దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం నీరవ్ మోడీ స్విట్జర్లాండ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడిపై ‘లుక్ అవుట్' నోటీసు జారీ అయింది.
గుర్తించలేకపోయాం: పీఎన్బీ ఎండీ
బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ 2011 నుంచి సాగించిన అనధికార లావాదేవీలను తాము గుర్తించలేకపోయామని, గత నెలలోనే దీన్ని గుర్తించామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా వెల్లడించారు. గురువారం ఎంసీ బ్రాడీ హౌస్ శాఖలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ స్కాంకు సంబంధించి వివరాలు తెలిపారు. ‘2011 నుంచి సాగుతున్న రూ.11,400 కోట్ల కుంభకోణాన్ని మేం ఈ ఏడాది జనవరి మూడో వారంలో గుర్తించాం. మూడు నాలుగు రోజులు అంతర్గత విచారణ అనంతరం జనవరి 29న దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశాం. సీబీఐ ఆ మర్నాడే కేసు నమోదు చేసింది..' అని సునీల్ మెహతా వివరించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం...
క్లీన్ బ్యాంకింగ్కు తాము కట్టుబడి ఉన్నామని, ఎలాంటి అవకతవకలు, అక్రమాలను సహించమని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా ప్రకటించారు. వేలకోట్ల రూపాయలు ఎగవేసి స్విట్జర్లాండ్ చెక్కేసిన నీరవ్ మోడీపై ఇప్పటికే ‘లుక్ అవుట్' నోటీసు జారీ అయిందని, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న తమ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశామని తెలిపారు. అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్ చేపడతామన్నారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంకు షేరు 13 శాతం పడిపోయింది.
ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు...
పంజాబ్ నేషనల్ బ్యాంకులో తలెత్తిన తాజా సంక్షోభాన్ని అధిగమించే సత్తా బ్యాంకుకు ఉందని ఆ బ్యాంక్ ఎండీ మెహతా స్పష్టం చేశారు. ఈ అనధికారిక లావాదేవీలు తమ శాఖల్లోని ఒకదానిలో మాత్రమే జరిగాయని, దీని ప్రభావం ఖాతాదారులపై పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. దర్యాప్తు సంస్థలు ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న సంస్థలపై దాడులు జరుపుతున్నాయని, కీలక పత్రాలు, రికార్డులను జప్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కుంభకోణానికి సంబంధించి రోజువారీగా పర్యవేక్షణ జరుపుతోందని, బ్యాంకుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు.