లిక్కర్ కింగ్ మాల్యకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యకు మళ్లీ చుక్కెదురైయ్యింది. ఢిల్లీలోని పాటియాల కోర్టు శుక్రవారం విజయ్ మాల్యకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇదే సమయంలో విజయ్ మాల్య మీద కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
చెక్ బౌన్స్ కేసు విచారణ సందర్బంగా కోర్టు ఈ విధంగా స్పంధించింది. విజయ్ మాల్య తీరు చూస్తుంటే ఆయన భారత్ కు తిరిగి వచ్చే ఉద్దేశం లేదని తెలుస్తుందని కోర్టు ఘాటుగా స్పంధించింది.
అనేక సార్లు ఈ విషయంలో ఆయనకు ఎన్ని సూచనలు ఇచ్చినా ఫలితం కనపడటం లేదని కోర్టు చెప్పింది. ఇదంతా చూస్తుంటే విజయ్ మాల్యకు కోర్టు అంటే గౌరవం లేదని స్పష్టం అవుతుందని గుర్తు చేసింది.
సమన్లు జారీ చేసినా విజయ్ మాల్య నుంచి ఎలాంటి స్పందన లేదని వ్యాఖ్యానించింది. సమన్లకు స్పందించకపోవడంతో విజయ్ మాల్యకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేస్తున్నామని కోర్టు చెప్పింది.
మరో కేసు విషయంలో ఒక నెలలో విజయ్ మాల్యకు సంబంధించిన పూర్తి ఆస్తి వివరాలు తమ ముందు పెట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ కేసు విచారణ నవంబర్ 24వ తేదీకి వాయిదా వేశారు.
తమకు చెల్లించాల్సిన రూ. 9,000 కోట్ల రుణం వసూలు చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు విజయ్ మాల్య డుమ్మకొట్టి తన న్యాయవాదులను పంపిస్తున్నారు.