రుణాలు, బకాయిలు చెల్లిస్తా: కొత్తప్లాన్తో మాల్యా ఆఫర్
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు బకాయిలు, తన రుణాలు చెల్లిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి విదేశాలకు పారిపోయిన మాల్యా.. ఆ రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
గతంలో ఓ ప్లాన్ను అందించగా, దానిని బ్యాంకులు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు అంగీకరించేలా ఓ సరికొత్త ప్రణాళికతో ఆయన రానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఓ న్యాయ సేవల సంస్థ సేవలను పొందుతున్నారని, ఆయన పూర్తి ఆస్తుల వివరాలు, చెల్లించాల్సిన రుణాలు, ఉద్యోగుల బకాయిలపై వివరాలను క్రోడీకరిస్తున్నారని తెలుస్తోంది.
ఓ వ్యాపారవేత్తగా, ఉద్యోగుల సంక్షేమం ఆయనకు అత్యంత ప్రాధాన్యతాంశమని, వారికి ఇవ్వాల్సిన అన్ని బకాయిలనూ తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2012లో మూతపడినప్పటి నుంచి ఉద్యోగుల బకాయిలు పేరుకుపోయాయి.
ఉద్యోగులతో పాటు బ్యాంకు రుణాలనూ వన్ టైం సెటిల్ మెంట్ కింద చెల్లించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. భారత్కు శాశ్వతంగా దూరం కావాలని ఎంతమాత్రమూ భావించడం లేదని, తన పేరు తిరిగి భారత దేశంలో వినిపించాలని మాల్యా కోరుకుంటున్నారని ఆయనకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తి చెప్పారని వార్తలు వస్తున్నాయి.