ఈడీ హెచ్చరికతో మాల్యా బెంబేలు: రూ.6వేల కోట్లకు సెటిల్మెంట్
బెంగళూరు: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... చివరకు దిగిరాక తప్ప లేదు. ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో షాక్ తిన్న మాల్యా... బ్యాంకుల రుణాలను చెల్లించేందుకు సిద్ధంగానే ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లిస్తానని ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయనకు మొట్టికాయలేసింది. ముందుగా మీ ఆస్తుల విలువెంతో చెప్పడంతో పాటు ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ కోర్టు ఆయనకు షాకిచ్చింది.
కాగా, ఐడీబీఐ కేసులో తన ముందుకు విచారణకు హాజరుకాని మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది. ఈ విషయం తెలుసుకున్న మాల్యా వేగంగా స్పందించారు. తన పాస్ పోర్టు రద్దు అయితే మరింత విషమ పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న భావించిన మాల్యా... రుణాల సెటిల్మెంట్కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు.
బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్లు, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకుని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈడీ షాక్తో బెంబేలెత్తిన మాల్యా... ఇంతకుముందు చేసిన రూ.4 వేల కోట్ల ఆఫర్ను తాజాగా మరో రూ.2 వేల కోట్లు పెంచుతూ.. మొత్తం సెటిల్మెంట్ను రూ.6 వేల కోట్లకు పెంచారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనను ఆయన త్వరలోనే కోర్టుకు ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.