భారత్ రావడానికి సిద్ధం కానీ: విజయమాల్యా షరతులు
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది వేల కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేసి బ్రిటన్లో ఉంటున్న కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా ఆఫర్ ఇచ్చాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమేనని చెబుతూనే, కొన్ని షరతులను విధించాడు.
విజయ మాల్యా నుంచి తాజాగా ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. మొత్తం పదిహేడు బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలను చెల్లించేందుకు సిద్ధమేనని అతను ప్రకటించాడు. అయితే, దేశానికి తిరిగి వచ్చేందుకు మాత్రం కొన్ని షరతులు పెట్టాడు.
ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆసక్తికర కథనం వచ్చింది. శుక్రవారం ముంబైలో జరిగిన యునైటెడ్ బ్రూవరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో విజయ మాల్యా కూడా పాల్గొన్నారు.
లండన్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరు సమావేశానికి హాజరై కీలక ప్రకటన చేశారు. రుణాలు చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు. తనను అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో పాటు తనకు రక్షణ కల్పిస్తామన్న హామీ లభిస్తే భారత్ వచ్చేందుకు సిద్ధమేనని చెప్పాడు.