ఈసారైనా?: ఆరోసారి వేలానికి కింగ్ ఫిషర్ హౌజ్.. ఇవీ వివరాలు..
ఈ దఫా రూ.82 కోట్ల రిజర్వు ధరతో కింగ్ ఫిషర్ హౌజ్ వేలం నిర్వహించబోతున్నారు.
కోల్కతా: దాదాపు 9వేల కోట్ల రుణ ఎగవేతకు పాల్పడి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా ఆస్తుల విక్రయం కొనసాగుతోంది. గతంలోను విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ హౌజ్ వేలం వేసినప్పటికీ కొనుగోలు చేసేందుకు.. ఎవరూ ముందుకు రాలేదు.
ఈ క్రమంలో ఆరోసారి ప్రాపర్టీని వేలం వేయబోతున్నారు. ఈ దఫా రూ.82 కోట్ల రిజర్వు ధరతో కింగ్ ఫిషర్ హౌజ్ వేలం నిర్వహించబోతున్నారు. దీని విస్తీర్ణం 2401.70 చదరపు మీటర్లు. డెట్ రివకరీ ట్రిబ్యునల్(కర్నాటక), డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించాయి.
ప్రకటనలో పేర్కొన్న ప్రకారం.. డిసెంబర్ 19న ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు వేలం వేయనున్నారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న బిడ్డర్లు ముందస్తుగా రూ.50లక్షల ఇంక్రిమెంటల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, కింగ్ఫిషర్ హౌజ్కు చెందిన 9 వాహనాలను రూ.4,90,00 రిజర్వు ధరకు ఈ నెల 11న వేలం వేసిన సంగతి తెలిసిందే. గత మే 31న నిర్వహించిన వేలంలో రిజర్వు ధరను రూ.93.50 కోట్లకు తగ్గించినప్పటికీ ఈ స్థిరాస్తిని కొనడానికి ఎవరు ఆసక్తి చూపలేదు. అప్పట్లో దీని రిజర్వే ధరను రూ.150కోట్లుగా నిర్ణయించారు.