ఎట్టకేలకు అమ్ముడుపోయిన మాల్యా లగ్జరీ ప్రయివేటు జెట్ విమానం
లండన్: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు చెందిన లగ్జరీ విమానం ఎట్టకేలకు వేలంలో అమ్ముడుపోయింది. గతంలో రెండుసార్లు ఈ ప్రయివేటు జెట్ విమానాన్ని వేలం వేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈసారి ఓ అమెరికన్ సంస్థ రూ.34.8 కోట్లకు (5.05 మిలియన్ డాలర్లు) బిడ్ వేసింది. బాంబే హైకోర్టు ఈ బిడ్ను ఆమోదించింది.
ఈ డబ్బుతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించాల్సిన బకాయిలను రికవరీ చేసుకుంటామని అధికారులు తెలిపారు. విమానాన్ని అమెరికాకు తరలించి ప్రీమియం కస్టమర్లకు సేవలు అందించేందుకు వినియోగిస్తామని అమెరికన్ కంపెనీ తెలిపింది.
పక్కా ప్లాన్తో మోడీ కొట్టిన దెబ్బ!: విజయ్ మాల్యా కాళ్ల బేరానికి రావడం వెనుక..?
విమానం లగ్జరీగా ఉంటుంది. దీని విలువ దాదాపు వంద మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే గత అయిదేళ్లుగా ఇది ప్రయాణించకపోవడం వల్ల ఇప్పుడు ప్రయాణానికి పనికొచ్చే పరిస్థితిలో లేదని తెలుస్తోంది. అందువల్లే విమానం చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది.
ఈ ప్రయివేటు జెట్లో 25 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణం చేయవచ్చు. ఇందులో లగ్జరీ బెడ్రూం, బాత్రూం, సమావేశం నిర్వహించుకునేలా ఏర్పాట్లు వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. సేవా పన్ను విభాగం ఈ విమానాన్ని 2013 సెప్టెంబరులో సీజ్ చేసింది.