‘భవనం కొనలేదు’: టైం కావాలని మాల్యా విన్నపం, ఆర్సీబీకి రిజైన్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఏప్రిల్ వరకు గడువు కావాలని ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ దిగ్గజం విజయ్మాల్యా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను కోరాడు. ఈ మేరకు ఈడీకి లేఖ రాసినట్లు సమాచారం.
మనీ లాండరింగ్ కేసులో మాల్యాపై సీబీఐ నిరుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టిన ఈడీ.. మార్చి 18న హాజరవ్వాలని మాల్యాకు సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మాల్యా.. తనకు మరింత గడువు కావాలంటూ ఈడీని కోరాడు.
కాగా, దాదాపు 17 బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్న మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ స్వదేశానికి తిరిగి రాకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేసే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభించారు.
మాల్యా భవనం కొనుగోలుకు విముఖత
బ్యాంకుల నుంచి దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో నిందితుడైనవిజయ్ మాల్యా ఇంటి వేలం ప్రక్రియ ముగిసింది. ముంబై నగర శివారు ప్రాంతమైన జోగేశ్వరిలోని మాల్యా నివాసానికి ఎస్బీఐ ఆన్లైన్ వేలం నిర్వహించింది.
ఈ వేలం ప్రారంభ ధర రూ.150కోట్లుగా ఎస్బీఐ నిర్ధారించింది. అయితే ఈ వేలానికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. సమయం ముగియడంతో వేలం ప్రక్రియ పూర్తయినట్లు బ్యాంకు ప్రకటించింది.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్కి రాజీనామా
రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పదవికి విజయ్ మాల్యా రాజీనామా చేసినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యజమాన్యం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ)కి తెలియజేసింది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లోని బిసిసిఐకి సంబంధించిన అధికారులు మార్చి 7న ఫ్రాంఛైజీ అధికారి రస్సెల్ ఆడమ్స్ నుంచి ఈ మేరకు మెయిల్ వచ్చినట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పుగా తీసుకొని చెల్లించని మాల్యా భారతదేశాన్ని విడిచి ఇంగ్లాండ్కి వెళ్లిపోయిన 5రోజులకు ఈ మెయిల్ వచ్చింది.
కాగా, మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యా డైరెక్టర్గా ఉన్నంత కాలం విజయ్ మాల్యా జట్టుకు హానరరీ చీఫ్ మెంటర్గా కొనసాగుతారని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సిద్ధార్థ్ మాల్యా ఒకరిగా ఉన్నాడు.
మాల్యా రాజీనామాతో జట్టు యాజమాన్యంలో ఎలాంటి మార్పు ఉండబోదమని ఆర్సిబి కమర్షియల్ ఆపరేషన్స్ అండ్ క్రికెట్ అకాడమీ ఉపాధ్యక్షుడు ఆడమ్స్ తెలిపారు. కాగా, యూనైటెడ్ స్పిరిట్స్కి ఆర్సిఎస్పిఎల్ అనుబంధ సంస్థ. దీన్ని డియాగో నియంత్రిస్తుంది.