విజయ్ మాల్యా వచ్చి పాస్ పోర్టు అప్పగించాలి
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ కింగ్ విజయ్ మాల్యా ఇండియా రావాల్సిందేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అంటున్నారు. భారీ మొత్తంలో ఆర్థిక కుంభకోణానికి పాల్పడి విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా భారత్ వచ్చి ఆయన పాస్ పోర్టును అధికారులకు అప్పగించాలని చెప్పారు.
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అయితే విజయ్ మాల్యాను భారత్ రావాలని, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించలేదని వివరించారు. అయితే సుప్రీం కోర్టు ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో అప్పుడు ఆ వ్యక్తి స్వయంగాగానీ, లాయర్ ద్వారాగానీ హాజరు కావచ్చని చెప్పారు.
విజయ్ మాల్యానే రావాలని లేదని వివరించారు. విజయ్ మాల్యా న్యాయవాది ద్వారా కూడా రావొచ్చు అన్నారు. విజయ్ మాల్యా ఎప్పటికైనా భారత్ రావాల్సిందే, అతని పాస్ పోర్టు సంబంధిత అధికారులకు అప్పగించాల్సిందే అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అంటున్నారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)తో పాటు అనేక బ్యాంకుల దగ్గర రుణం తీసుకున్న విజయ్ మాల్యా తీసుకున్న రుణం చెల్లించలేదని సమాచారం. చివరికి విసిగిపోయిన బ్యాంకుల యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే అప్పటికే విజయ్ మాల్యా విదేశాలకు వెళ్లి పోయారని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది.