మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
ఇంకా ఆయనేమన్నారంటే.. 'బ్రిటన్తో భారత్కు ఉన్న ఒప్పందాల మేరకు మాల్యాను అప్పగించాల్సిందే. కానీ అదంతా సులువుగా జరిగే పని కాదు. అయినా సరే మేం ప్రయత్నిస్తాం' అని వీకె సింగ్ అన్నారు.
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా విషయంలో ఇక చేతులెత్తేసినట్లేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మంగళవారం నాడు భువనేశ్వర్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వీకె సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాల్యాపై ఆయన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా మాల్యా అప్పగింత కేసు విచారణ ప్రారంభమైన రోజే విదేశాంగ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఆయనేమన్నారంటే.. 'బ్రిటన్తో భారత్కు ఉన్న ఒప్పందాల మేరకు మాల్యాను అప్పగించాల్సిందే. కానీ అదంతా సులువుగా జరిగే పని కాదు. అయినా సరే మేం ప్రయత్నిస్తాం' అని వీకె సింగ్ అన్నారు. అయితే మాల్యాను ఇండియాకు రప్పించడానికి ఇంకెంత కాలం పడుతుందన్న ప్రశ్నను ఆయన దాటవేయడం గమనార్హం. నేరస్తుల అప్పగింత ప్రక్రియకు ఇంకా గడువు ఉందని, నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటామని తెలిపారు.
దొంగా.. దొంగా అంటూ: ఓవల్ స్టేడియంలో మాల్యాకు చేదు అనుభవం
పోస్టాఫీసుల్లో పాస్ పోర్టు సేవలు:
దేశవ్యాప్తంగా 800పోస్టాఫీసుల్లో పాస్ పోర్టు సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని వీకె సింగ్ అన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి 150పోస్టాఫీస్ కేంద్రాల్లో సేవలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆధార్ కార్డుల జారీ, సమాచార మార్పులు వంటి అంశాలపై పోస్టాఫీసుల నుంచే నేరుగా సేవలు ప్రారంభిస్తామన్నారు.
మాల్యా అప్పగింత కేసు విచారణ:
షెడ్యూల్ ప్రకారం మాల్యా అప్పగింత కేసు విచారణ గత నెల 17న జరగాల్సి ఉండగా.. దీనిపై విచారణ జూన్ 13వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం మాల్యా కేసును విచారించింది. ఈ విచారణకు మాల్యా కూడా హాజరైనట్లు తెలుస్తోంది. భారత్ తరుపున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తోంది.