లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్: సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగిన లిక్కర్ స్కాం కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ముందు కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. మంగళవారం 'ఓన్లీ మచ్ లౌడర్' సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయర్ను అరెస్ట్ చేశారు. ఇతను మంత్రి మనీశ్ సిసోడియా సన్నిహితుడని తెలుస్తోంది. ఇతనిని విచారిస్తే మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది.
ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో సేవలు అందిస్తున్న ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. సంస్థకు ఇదివరకు సీఈఓగా ఉన్న విజయ్ నాయర్ను కేసులో ఐదో నిందితుడిగా సీబీఐ అధికారులు చేర్చారు.కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ నాయర్కు చెందిన కీలక ఆధారాలు లభించడంతో మంగళవారం ముంబైలో ఉన్న ఆయనను అరెస్ట్ చేశారు.
అక్కడ అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. నాయర్ ఇళ్లు, కార్యాలయాల వద్ద ఇదివరకు ఈడీ కూడా సోదాలు నిర్వహించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో నాయర్ ముఖ్య కుట్రదారు అని సీబీఐ భావిస్తోంది. గతనెల 21వ తేదీన సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది. అందులో 8 మంది ఉండగా.. వారిలో విజయ్ నాయర్ ఒకరు. అయితే రైడ్స్ నిర్వహించే సమయంలో నాయర్ అప్పటికే ఎస్కేప్ అయ్యారు.
తాను ఎక్కడికి పారిపోలేదని విజయ్ నాయర్ తెలిపారు. కొన్ని పనుల వల్ల మాత్రమే విదేశానికి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. సీబీఐ అధికారులకు టచ్లో ఉన్నానని.. విచారణకు సహకరిస్తున్నానని తెలిపారు.