గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణం, అమిత్ షా చక్రం!
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో గవర్నర్ ఓపీ కోహ్లి ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తదితరులు హాజరయ్యారు. గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
విజయ్ రూపానీ ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అరవై ఏళ్ల రూపానీ శనివారం గవర్నర్ ఓపీ కోహ్లీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. శుక్రవారం రూపానీ భాజపా శాసన సభాపక్షం నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఆనందీ బెన్ పటేల్ స్థానంలో విజయ్ రూపానీని ఎన్నుకోవడంలో పార్టీ జాతీయ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. గవర్నర్ను కలిసిన వారిలో రూపానీ, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నితిన్ పటేల్, ఇతర రాష్ట్ర నేతలు ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్.. తన వారసుడిగా నితిన్ పటేల్ను చూడాలనుకున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. రూపానీ కోసం పట్టుబట్టారు. ప్రధాని మోడీ వద్ద చక్రం తిప్పారు.
చివరకు ప్రధాని కుదిర్చిన రాజీ సూత్రం ప్రకారం నితిన్ పటేల్ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. రూపానీ, నితిన్ పటేల్లు ఇద్దరూ శనివారం మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ ఇంటికెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ రోజు ప్రమాణం చేశారు.