గుజరాత్ సీఎం, డిప్యూటీ సీఎంగా విజయ్ రూపానీ, నితిన్ పటేల్ ప్రమాణ స్వీకారం
Recommended Video
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి చేత గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇటీవల జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఆరోసారి భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీని మరోసారి ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ఖరారయ్యారు.
ఈ మేరకు ఈ నెల 23న భాజపా రాష్ట్ర నేతలు గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదించడంతో మంగళవారం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, అనంత్ కుమార్ హాజరయ్యారు.
ఇంకా, గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్, గోవా సీఎం పారికర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, బీహార్ సీఎం నితీష్ కుమార్, చత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలువురు ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఉదయమే తన సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ చేరుకున్న మోడీ అక్కడ రోడ్ షోలో పాల్గొన్నారు.
మోడీని ఆహ్వానించేందుకు విమానాశ్రయం నుంచి దారి పొడవునా గుజరాతీ సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు. తనను చూసేందుకు పెద్దయెత్తున తరలివచ్చిన ప్రజలకు మోడీ అభివాదం చేశారు.