ఐటీ దాడులు: విజయభాస్కర్ మంత్రిగానే ఉంటారు: టీటీవీ దినకరన్ ధీమా !
చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ పదవికి ఎలాంటి ఢోకాలేదని, ఆయన పని ఆయన చేసుకుని వెలుతారని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ హామీ ఇచ్చారు. మంత్రి విజయభాస్కర్ ఎలాంటి తప్పు చెయ్యలేదని దినకరన్ అంటున్నారు.
గురువారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆదాయపన్ను శాఖ దాడుల్లో పీకల్లోతుల్లో కూరుకుపోయిన మంత్రి విజయభాస్కర్ ను వెనుకేసుకొచ్చారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్ పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఓటర్లకు డబ్బులు ఇవ్వలేదు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్థానిక ఓటర్లకు రూ. 89 కోట్లు బట్వాడా చెల్లించారని ఐటీ అధికారులు అంటున్నారు కదా అని మీడియా ప్రశ్నిస్తే అలాంటిది ఏమీ లేదని, తాము ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నించలేదని, ప్రత్యర్థి పార్టీల వారు డబ్బు పంచిపెట్టి ఉంటారని టీటీవీ దినకరన్ చెప్పారు.
ఏ మంత్రికి సంబంధం లేదు
విజయభాస్కర్ మాత్రమే కాదు తమిళనాడు మంత్రులు ఎవ్వరూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తనతరపున డబ్బులు పంచిపెట్టలేదని దినకరన్ స్పష్టం చేశారు. అంత డబ్బు మా దగ్గర ఎక్కడ ఉంది అంటూ ఆయన మీడియానే ప్రశ్నించారు.
ఎవరు చెప్పారు మీకు
సీఎం ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గం నుంచి విజయభాస్కర్ ను తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి కదా అంటే అది మీ ఊహ మాత్రమే అని, అలాంటిది ఏదీ జరగదని దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.
అవునా, నాకు తెలీదు
ఐటీ అధికారులు త్వరలో మరో ఆరుగురు మంత్రులను విచారించాలని నిర్ణయించారని, మీకు ఎమైనా తెలుసా అంటే ఇంత వరకూ ఆ విషయం నాకు తెలీదని టీటీవీ దినకరన్ మాటదాట వెయ్యడానికి ప్రయత్నించారు.
ఎమ్మెల్యేల దిమ్మతిరిగింది
మొత్తం మీద ఐటీ దాడులకు గురైన తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు టీటీవీ దినకరన్ బహిరంగంగానే మద్దతు తెలపడంతో శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈయన ఎక్కడ కొంప ముంచుతారో అంటూ హడలిపోతున్నారు.