అలా వదిలేస్తామా: దావూద్ లొంగబాటు వ్యాఖ్యలపై విజయ రామారావు
హైదరాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లొంగుబాటు గురించి ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీర్జ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో అప్పటి సిబిఐ చీఫ్ విజయ రామారావు తీవ్రంగా ప్రతిస్పందించారు. నీరజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను సిబిఐ చీఫ్గా ఉన్నప్పుడు దావూద్కు సంబంధించిన ఏలాంటి ప్రతిపాదనలు కూడా రాలేదని ఆయన శనివారం స్పష్టం చేశారు.
దావూద్ కోసం ఇప్పటికీ అనేక దేశాలు గాలిస్తున్నాయని, అటువంటి దావూద్ లొంగిపోతానంటే వదిలేస్తామా అని విజయరామారావు అన్నారు. దావూద్ లొంగుబాటుపై అప్పట్లో తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు.
దావూద్ గురించి చాలా సమాచారం మాత్రం వచ్చిందని, అయితే లొంగిపోతానని మాత్రం ప్రతిపాదన చేయలేదని చెప్పారు. తాను సిబిఐ చీఫ్గా ఉన్నప్పుడు దావూద్ కోసం దుబాయ్ సహా అనేక దేశాల్లో గాలించామని విజయరామారావు చెప్పినట్లు చెప్పారు. దావూడ్ సరెండర్ అవుతానన్న విషయం తనకు ఏ అధికారి కూడా చెప్పలేదని, ఏ సమాచారం ఇచ్చినా రికార్డు అవుతుందని ఆయన చెప్పారు.
ముంబై వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ లొంగిపోతానని రాయబారం నడిపాడని, అయితే సిబిఐ పట్టించుకోకుండా వదిలేసిందని నీరజ్ కుమార్ అన్నారు. అప్పటి సిబిఐ డిఐజిగా ఉన్న తనకు దావూద్ మూడు సార్లు ఫోన్ చేశాడని కూడా చెప్పారు.