ఆసుపత్రిలో విజయ్కాంత్: ఏమైందన్న ఆందోళనలో కార్యకర్తలు!..
డీఎండీకే నేతలు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని అంటున్నారు.
చెన్నై: డీఎండీకే అధినేత, ప్రముఖ సినీ హీరో విజయ్ కాంత్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన మరో రెండు, మూడు రోజులు ఆసుపత్రికి పరిమితమవుతారని తెలుస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అసలు విజయ్ కాంత్ కు ఏమైందన్న ప్రశ్న ఇప్పుడు వారిని కలవరపెడుతోంది.
విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన ఏది లేకపోవడంతో ఈ గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే డీఎండీకే నేతలు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జీ అవుతారని వారు చెప్పారు.
విజయ్ కాంత్ ఆరోగ్యం బాగానే ఉందని నేతలు చెబుతున్నప్పటికీ.. కార్యకర్తలు మాత్రం ఆ మాటలు విశ్వసించడం లేదు. ఆరోగ్యం నిలకడగా ఉంటే రెండు, మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. విజయ్ కాంత్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తెలియగానే కార్యకర్తలంతా ఆసుపత్రి వద్దకు తరలి వస్తున్నారు. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డాక్టర్లను డిమాండ్ చేస్తున్నారు.