ఇప్పుడా: జయలలితపై ఖుష్బూ,విజయకాంత్ థ్యాంక్స్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరద సాయంలో జయ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. జనం గగ్గోలు పెడుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు.
జయలలిత సర్కార్ మరీ మందమతిగా ఉన్నదని ధ్వజమెత్తారు. చెన్నై నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసిన వారం తర్వాత జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందుకోసం వెంటనే ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
చెన్నై పట్టణంలో వరద బాధిత ప్రాంతాలను అసలు పట్టించుకోలేదన్నారు. నగరంలో ఏ మూలకు వెళ్లినా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారన్నారు. ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, అధికార పార్టీ నాయకులు పత్తా లేకుండా పోయారన్నారు.
కాగా, వరద బాధితులను ఆదుకున్న వారికి నటుడు, డిఎండికె అధ్యక్షులు విజయకాంత్ ధన్యవాదాలు తెలిపారు. విరాళాలు ఇచ్చిన వారికి, ఆపద సమయంలో ముందుండి సహకరించిన వారికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇటీవల భారీ వర్షం, వరదలు చెన్నైని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.