ఆర్కేనగర్లో ప్రత్యేక ఆకర్షణగా విజయశాంతి ప్రచారం: దినకరణ్కు అదనపు బలమే!
ప్రముఖ నటి విజయశాంతి మరోసారి తమిళనాడు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు సీఎం జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళే సీఎం కావాలంటూ ఆమెకు మద్దతు
చెన్నై: ప్రముఖ నటి విజయశాంతి మరోసారి తమిళనాడు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు సీఎం జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళే సీఎం కావాలంటూ ఆమెకు మద్దతు పలికిన విజయశాంతి.. ఇప్పుడు ప్రత్యక్షంగా అక్కడి రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న దినకరన్కు మద్దతు విజయశాంతి ప్రచారం చేస్తుండటం గమనార్హం.
ప్రత్యేక ఆకర్షణగా విజయశాంతి
అన్ని పార్టీల అభ్యర్థులు తమ నేతలతో శుక్రవారం ప్రచారం నిర్వహించగా, దినకరన్కు మద్దతుగా ప్రచారం చేస్తున్న విజయశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు ఎన్నికల్లో సహజంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యనే ప్రధాన పోటీ. అయితే జయలలిత మరణం, అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఆర్కేనగర్లో డీఎంకే అభ్యర్థి పోటీచేస్తున్నా.. అన్నాడీఎంకే నుంచి రెండు వైరి వర్గాలే ఒకరిపై ఒకరు పట్టుదలతో ఉన్నారు.
దినకరణ్ కోసం
ఆర్కే నగర్ ప్రచారం కోసం దినకరన్ తమిళ సినీ రంగానికి చెందిన పలువురు తారలను ప్రచారంలోకి దించారు. తాజాగా దినకరన్ తరఫున విజయశాంతి రంగ ప్రవేశం చేశారు. ఆర్కేనగర్ నియోజకవర్గ పరిధిలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కొరుక్కుపేట, శాస్త్రినగర్, కామరాజనగర్, తదితర ప్రాంతాల్లో విజయశాంతి ప్రచారం నిర్వహించారు.
విజయశాంతి కోసం భారీగా..
విజయశాంతి వెంట తిరువళ్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీవీ.రమణ, అన్నాడీఎంకే కార్యదర్శి బలరామన్, గుమ్మిడిపూండి జిల్లా కార్యదర్శి విజయకుమార్, పూందమల్లి ఎమ్మెల్యే ఏలుమలై ఉన్నారు. ప్రచార సమయంలో తెలుగు ప్రజలు తమ అభిమాన నటి విజయశాంతికి ఘన స్వాగతం పలకడంతో పాటూ ఆమెను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.
పోటా పోటీ ప్రచారాలు..
శశికళ వర్గం, మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. డీఎంకే కూడా ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో బీజీగా వుంది. ఏప్రిల్ 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డి జయలలిత సొంత నియోజకవర్గం ఆర్కేనగర్లో పట్టుసాధించాలని భావిస్తున్నాయి. దీంతో ధన ప్రవాహం కూడా భారీగానే పారుతోంది. పలు ప్రాంతాల్లో ఇరువర్గాలు దాడులతో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది.