కొత్త వ్యవసాయ చట్టాలతో వారికే నష్టం: విజయవాడలో నిర్మలా సీతారామన్
విజయవాడ: కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేసేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బుధవారం విజయవాడ, గన్నవరంలో కేంద్రమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యవసాయ రంగ నిపుణులతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మల మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను పూర్తిగా నిలబెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందనేది తప్పుడు ప్రచారమేనని అన్నారు.
మార్కెట్ కమిటీలను తొలగిస్తామని కాంగ్రెస్, విపక్షాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మంచి ధర కోసం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కాయగూరలు, పళ్లు అమ్ముకుంటే ఏంటి అభ్యంతరం అని ఆమె నిలదీశారు.
Andhra Pradesh: Union Finance Minister Nirmala Sitharaman visited farms in Jakkula Nekkalam village of Krishna district and interacted with farmers today. pic.twitter.com/Q3MaloljwM
— ANI (@ANI) October 7, 2020
మార్కెట్ యార్డుల పన్ను, మధ్యవర్తుల పన్ను రైతులపై భారంగా ఉందని.. కొత్త వ్యవసాయ చట్టాలతో మార్కెట్కు వెళ్లకుండానే సరుకు అమ్ముకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కొత్త చట్టాలతో దళారులకే నష్టమని.. రైతులకు కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
కష్టపడి పంట పండించే రైతుకు మంచి ధర ఇవ్వాల్సిందేనని అన్నారు. అతి తక్కువ వర్షపాతం ఉండే ఖచ్ ప్రాంతంలో ఎక్కువ హార్టికల్చర్ పండుతోందని, డ్రిప్ వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెంట బీజేపీ నేతలు సునీల్ దేవధర్, జీవీఎల్ నర్సింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు.