వికాస్ దూబే ఎన్కౌంటర్.. అసలు 'సీన్' ఇదీ... కానీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పని పోలీస్...
కాన్పూర్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై అనేక అనుమానాలు తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్పై పోలీసులు చెప్తున్న కథనం నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసలు దూబేని తరలిస్తున్న కారు ఎలా ప్రమాదానికి గురైందని చాలామంది ప్రశ్నించారు. ప్రమాద స్థలంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నట్లు కనిపించట్లేదని... అలాంటప్పుడు ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దూబేని ఎన్కౌంటర్ చేయడమంటే ఎంతోమంది రాజకీయ నాయకులు,పోలీసులతో అతని రహస్యాలను ఎన్కౌంటర్ చేసినట్లేనని పలువురు అభిప్రాయపడ్డారు.
దొరికినట్లే దొరికి... గ్యాంగ్స్టర్ దూబే ఎస్కేప్... సన్నిహితుడి ఎన్కౌంటర్...
ప్రమాదానికి కారణం ఏం చెప్పారంటే...
ఈ ప్రశ్నలకు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమాధానమిచ్చింది. దూబేని తరలిస్తున్న కారుకు... రోడ్డుపై అకస్మాత్తుగా ఆవులు,గేదెల మంద అడ్డురావడంతో వాహనం ప్రమదానికి గురైందని వెల్లడించింది. పశువుల మందను తప్పించేందుకు డ్రైవర్ ఒక్కసారిగా కారును పక్కకు మళ్లించాడని... ఈ క్రమంలో వాహనం పల్టీలు కొట్టిందని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ రమాకాంత్ పచౌరి,సబ్ఇన్స్పెక్టర్స్ పంకజ్ సింగ్,అనూప్ సింగ్,కానిస్టేబుళ్లు సత్యవీర్,ప్రదీప్ కుమార్ తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు.
ప్రాణాలతోనే పట్టుకోవాలనుకున్నప్పటికీ...
కారు బోల్తా కొట్టగానే... అదే అదునుగా భావించి వికాస్ దూబే ఇన్స్పెక్టర్ రమాకాంత్ గన్ను లాక్కుని... వాహనం నుంచి బయటకొచ్చాడని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడన్నారు. ఆ సమయంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ కాన్వాయ్కి చెందిన మరో కారు అక్కడికి చేరుకుందని చెప్పారు. పరిగెత్తుతున్న దూబేని డీఎస్పీ తేజ్ ప్రతాప్ సింగ్,ఇతర టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంబడించినట్లు చెప్పారు. దూబేని ప్రాణాలతోనే పట్టుకోవాలని భావించినప్పటికీ... అతను పోలీసుల పైకి కాల్పులు జరపడంతో... ఆత్మరక్షణలో భాగంగా వారు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు.
ఆ ప్రశ్నకు జవాబు లేదు...
ఆ వెంటనే దూబేని ఆస్పత్రికి తరలించామని... కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించాన్నారు. దూబే జరిపిన కాల్పుల్లో ఇన్స్పెక్టర్ శివేంద్ర సింగ్,కానిస్టేబుల్ విమల్ యాదవ్ గాయపడ్డట్లు తెలిపారు. అయితే దూబే ఎన్కౌంటర్కి గురయ్యాడని చెప్తున్న చోటు వర్షంతో తడిచి చిత్తడిగా ఉందని... అలాంటప్పుడు దూబే దుస్తులకు ఎక్కడా బురద అంటుకోకపోవడమేంటని మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు.
దూబే కాలికి సర్జరీ.. మరి ఎలా పరిగెత్తాడు..?
అంతేకాదు,దూబేకి గతంలో ఒక కాలికి సర్జరీ జరిగిందని... అందులో రాడ్ వేశారని కొంతమంది జర్నలిస్టులు గుర్తుచేశారు. దీంతో కొన్ని సందర్భాల్లో అతను చేతికర్రను వాడుతాడని తెలిపారు. అలాంటి వ్యక్తి వాహనం బోల్తా పడ్డ తర్వాత.. అక్కడినుంచి తప్పించుకుని అంత వేగంగా ఎలా పరిగెత్తాడని ప్రశ్నించారు. దీనిపై స్పందించేందుకు కూడా పోలీసులు నిరాకరించారు. అలాగే ఎన్కౌంటర్ స్పాట్కి 500మీ. దూరంలో జర్నలిస్టులతో సహా అందరి వాహనాలు ఎందుకు నిలిపేశారన్నప్రశ్నకూ వారి వద్ద నుంచి సమాధానం లేకపోయింది.
కాన్పూర్కి తరలిస్తుండగా ఎన్కౌంటర్...
జూలై 3న కాన్పూర్లోని బిక్రూ గ్రామంలో ఓ డీఎస్పీ సహా 8 మంది పోలీసులను గ్యాంగ్స్టర్ దూబే గ్యాంగ్ పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి పరారీలో ఉన్న దూబే కోసం పోలీసులు నిర్విరామంగా గాలించారు. ఎట్టకేలకు గురువారం(జూలై 9) మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆలయంలో దూబే పట్టుబడ్డాడు. అయితే అది అరెస్టా.. లొంగుబాటా..అన్న సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడినుంచి కాన్పూర్ తరలిస్తుండగా... శుక్రవారం(జూలై 10) తెల్లవారుజామున ఎన్కౌంటర్కి గురయ్యాడు. ఈ ఎన్కౌంటర్పై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి దీనిపై సుప్రీం విచారణ చేపట్టాలని కోరారు.