గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్? హైడ్రామా..సినీ ఫక్కీలో కారు పల్టీ: క్రైమ్ థ్రిల్లర్
లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన టాప్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్లో హతమైనట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదశ్ పోలీసులు అతణ్ని కాల్చి చంపినట్లు ప్రాథమికంగా వార్తలు అందుతున్నాయి. దీన్ని పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. మధ్య ప్రదేశ్లోని ఉజ్జయినీలో అతణ్ని అరెస్టు చేశారు. కాన్పూర్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో అతణ్ని తీసుకొస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. పల్టీ కొట్టింది.
Recommended Video
తప్పించుకుని పారిపోతుండగా..
అదే సమయంలో వికాస్ దుబే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోతుండగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయాన్ని కాన్పూర్ ఎస్పీ (వెస్ట్) తెలిపారు. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ సందర్భంగా వికాస్ దుబే శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. కారు పల్టీ కొట్టిన తరువాత అతను తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడని అన్నారు. లొంగిపోవాలంటూ సూచించినప్పటికీ.. అతను అంగీకరించలేదని, దీనితో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ వెల్లడించారు.
ఎనిమిది మంది పోలీసులను మట్టుబెట్టి..
వికాస్ దుబే.. ఉత్తర ప్రదేశ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన టాప్ మోస్ట్ గ్యాంగ్స్టర్. కాన్పూర్ను కేంద్రంగా చేసుకుని చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన క్రిమినల్. ఉత్తర ప్రదేశ్ పోలీసుశాఖలోనూ తనకంటూ ఓ వర్గాన్ని సృష్టించుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల తరహాలో ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో తనకు వ్యతిరేకంగా ఏం జరుగుతున్న వెంటనే తెలిసిపోయేలా నెట్వర్క్ను నిర్మించుకున్నాడు.. దాన్ని విస్తరించుకున్నాడు. కొద్దిరోజుల కిందట తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఎనిమిది మంది ప్రాణాలను హరించి వేశాడు.
ఎన్కౌంటర్ తరువాత తప్పించుకుని..
కాన్పూర్ శివార్లలోని బిక్రూ గ్రామంలో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన తరువాత వికాస్ దుబే అతని అనుచరులు ఎస్కేప్ అయ్యారు. వికాస్ దుబే అతని గ్యాంగ్ తలదాచుకున్న ప్రదేశాన్ని పోలీసులు చుట్టుముట్టినప్పటికీ.. వారు తప్పించుకుని పోవడం సంచలనం రేపింది. ఆ తరువాత ఈ గ్యాంగ్ కోసం ఉత్తర ప్రదేశ్ పోలీసులు జల్లెడ పట్టారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షార్ప్ షూటర్లతో కూడిన స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్ను ఏర్పాటు చేసింది.
పోలీసు శాఖలో తనకంటూ
ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని అతను సృష్టించుకున్నాడంటే నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడ్డదారుల్లో తాను సంపాదించిన మొత్తంలో పోలీసుల కోసం కొంత ఖర్చు చేసేవాడని అంటున్నారు. తనకు సహకరించే పోలీసులకు ప్రతినెలా జీతాలను చెల్లించే వాడని చెబుతున్నారు. హఫ్తా తరహాలో పోలీసులకు ఆర్థికంగా సహకరించాడనే వార్తలు ఉన్నాయి. ఈ క్రమంలో వికాస్ దుబేకు సహకరించినట్లు అనుమానిస్తోన్న ముగ్గురు పోలీసులను ప్రభుత్వం వేటు వేసింది.
ఇప్పటికే ముగ్గురిని కాల్చి చంపిన పోలీసులు
గురువారం తెల్లవారుజామున వికాస్ దూబే సన్నిహితుడు రణబీర్ అలియాస్ బబ్బన్ శుక్లా, మరో అనుచరుడు ప్రభాత్ మిశ్రాను ఎన్కౌంటర్ చేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వికాస్ దూబే కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎస్టీఎఫ్ పోలీసులకు మహేవా పోలీస్స్టేషన్ పరిధిలోని బకేవర్ జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఓ అనుమానిత స్విఫ్ట్ డిజైర్ కారు కనిపించింది. అంతకుముందే వికాస్ దుబే కుడిభుజం అమర్ దుబేను కాల్చి చంపారు.
ఘటనలో పోలీసుల కట్టడీ నుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నించిన దూబే అనుచరుడు ప్రభాత్ మిశ్రాను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.