దొరికినట్లే దొరికి... గ్యాంగ్స్టర్ దూబే ఎస్కేప్... సన్నిహితుడి ఎన్కౌంటర్...
గూండా రాజ్యం అంతమైపోయిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గంభీర ప్రకటనలు చేస్తున్నా... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగానే కనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న రోజే...అలహాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. మరో చోట ఓ దళిత బాలిక ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేతిలో హత్యాచారానికి గురైంది. ఉత్తరప్రదేశ్లో గూండా రాజ్కి ఇవన్నీ అద్దం పడుతున్నాయి. ఈ విమర్శలను తుడిచిపెట్టేందుకు వికాస్ దూబేపై తగిన యాక్షన్ తీసుకోవాలని యూపీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం వికాస్ దూబేను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా.. ఓ హోటల్లో దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు.
ఫరీదాబాద్ శ్రీరామ్ హోటల్లో...
ఫరీదాబాద్లోని బద్కాల్ చౌక్లో ఉన్న శ్రీరామ్ హోటల్లో వికాస్ దూబే ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు హోటల్పై దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకోగా... వికాస్ దూబే మాత్రం తప్పించుకున్నాడు. నిజానికి దూబే వద్ద ప్రస్తుతం ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతనికి రూమ్ ఇచ్చేందుకు హోటల్ యాజమాన్యం నిరాకరించినట్లు తెలుస్తోంది. అతను ఆ హోటల్కు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి.
పరారీలో దూబే...
పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి చేరుకునే లోపే దూబే పరారయ్యాడు. అయితే అతనికి సహకరించిన ముగ్గురు సన్నిహితులను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. వికాస్ దూబే ఢిల్లీలోని ఎన్సీఆర్ రీజియన్లో ఉన్న కోర్టులో లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు. దూబే ఎటువైపు వెళ్లాడో తెలుసుకునేందుకు హోటల్ సమీపంలోని రోడ్లపై ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
దూబే సన్నిహితుడి ఎన్కౌంటర్...
మరోవైపు వికాస్ దూబేకి అత్యంత సన్నిహితుడైన అమర్ దూబేని హమీర్పూర్ సమీపంలోని మౌదహ వద్ద బుధవారం(జూలై 8) పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 8 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో అమర్ దూబే కూడా వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. మిగతా గ్యాంగ్ను పట్టుకునేందుకు దాదాపు 40 పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులతో ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది.కాన్పూర్,కాన్పూర్ డెహత్,ఉనావ్,అలాగే చుట్టుపక్కల జిల్లాల్లో వికాస్ దూబే ఆచూకీ కోసం పోలీసులు పోస్టర్లు కూడా అంటించారు.
ముగ్గురు పోలీసులపై వేటు..
వికాస్ దూబేని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులను అతని గ్యాంగ్ కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమాచారాన్ని పోలీస్ శాఖలోని వ్యక్తులే లీక్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు పోలీసులపై వేటు కూడా పడింది. ఇందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ఒక కానిస్టేబుల్ ఉన్నారు. పరారీలో ఉన్న దూబే సన్నిహితుడు దయాశంకర్ అగ్నిహోత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. పోలీసులే తమకు ఉప్పందించినట్లు అతను వెల్లడించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆ గ్యాంగ్ను,వారికి సహకరించిన పోలీసులను విడిచిపెట్టబోమని పోలీస్ అధికారులు చెబుతున్నారు.