లేఖ: బిఎల్ఎఫ్ నుంచి తప్పుకున్న విక్రమ్ సంపత్
బెంగళూరు: బెంగళూరు లిట్ ఫెస్ట్(బిఎల్ఎఫ్)ను అసహనం అంశం తీవ్రంగా కుదిపేయడంతో మనస్తాపానికి గురైన రచయిత, బిఎల్ఎప్ స్థాపకులు విక్రమ్ సంపత్ దాని డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అసహనం అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏవైపు ఉండాలో తేల్చుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన విక్రమ్ ఇటీవలే తను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ కొందరు రచయితలు తమ అవార్డులను తిరిగి ఇవ్వడాన్ని విక్రమ్ సంపత్ ఖండించారు.
‘ఇది బాధ కలిగించే నిర్ణయమే అయినా తప్పడం లేదు. నా నిర్ణయాన్ని మీడియాకు వెల్లడిస్తున్నా. మన దేశంలో జ్ఞానం వ్యాప్తి చెందుతుందని కోరుకుంటున్నా' అని తన రాజీనామాపై విక్రమ్ సంపత్ తన ఫేస్బుక్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
ఇంకా ఏమన్నారంటే.. గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. రెండు కారణాల వల్ల నేను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోబడ్డాను. మొదటిది ‘అవార్డు వాపసీ' ప్రచారంలో నేను ఎందుకు పాల్గొనడం లేదనేది. నా అభిప్రాయం ప్రకారం నేను పాల్గొనలేదు. నేను అక్టోబర్ 2015లో ఓ ఆర్టికల్ రాశాను. నేను నా సాహిత్య అకాడమీ అవార్డును ఎందుకు వెనక్కి ఇవ్వడం లేదో చెప్పాను. భారత ప్రజలు నా పని చూసి ఈ అవార్డు ఇచ్చారు. స్వతంత్ర జూరీ, సహచర రచయితలు, సాహితీవేత్తలు నాకు అవార్డు ఇచ్చిన న్యాయనిర్ణేతల్లో ఉన్నారు. అక్కడ ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం లేదు.
అందుకే నేను చెబుతున్నా.. నేను చేసిన పనికి వచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారం అది. నా సొంత రచయితల కమ్యూనిటీ, మేధావులు ఇచ్చినది. ఇది ఏ రాజకీయ పార్టీ ఇచ్చినది కాదు. ప్రభుత్వం నుంచి స్వేచ్ఛాయుత ఆలోచనలను వెల్లడించడానికి, భావ ప్రకటనలను వెల్లడించేందుకు రచయితలుగా పెన్నుకు పదును పెట్టాలి. అది కొనసాగిస్తా. అదే నా అభిప్రాయం.
ఇక రెండోది.. తాజా టిప్పు సుల్తాన్ వివాదంపై నా అభిప్రాయం. ప్రముఖ చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఎపిగ్రఫిస్టులు, కళాకారుల బృందంతోపాటు నేను పిటిషన్పై కూడా సంతకం చేశాను. గత 15ఏళ్లకుపైగా మైసూరు చరిత్రపై అధ్యయనం చేసిన వ్యక్తిగా.. ఈ గొప్ప దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాల్సిన అసరం ఉంది.
నేను మీడియాల్లో వచ్చిన కథనాలు, వ్యక్తిగత సంభాషణల ద్వారా గమనించా. ఈ రెండు పరిణామాల కారణంగా పలువురు రచయితలు బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్(బిఎల్ఎఫ్)లో పాల్గొనేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. బిఎల్ఎఫ్ అనేది బెంగళూరు పౌరులతో కలిసి 2012లో నేను స్థాపించిన సంస్థ.
బిఎల్ఎఫ్ అనేది బెంగళూరు పండగ. నగరానికి సంబంధించిన లిటరేచర్ వేడుక. దేశంలోనే పెద్దదైన ఈ సంస్థను కలిగి ఉన్నందుకు మనం గర్వంగా భావించాలి. ఈ ఫెస్టివల్ స్వేచ్ఛను కలిగి ఉంది. అలాగే తటస్థను కూడా. అలాగే ఉండాలి. అది ఈరోజు కష్టసాధ్యంగా మారిపోయింది.
నిర్వాహకులు, సలహాదారులు, అందరూ బెంగళూరు పౌరులు కూడా బిఎల్ఎఫ్ మద్దతుగా నిలుస్తారని కోరుకుంటున్నా. ఎన్నో వ్యయప్రయాసాలతో బిఎల్ఎఫ్ నిర్మాణం జరిగింది. ఎన్నో చర్చలకు వేదికగా నిలిచింది.
ఇది ‘విక్రమ్ సంపత్ ఫెస్టివల్'గా అని కూడా పిలుచుకోవచ్చు. మీడియా కథనాలు, రచయితల నిరసనలతో విక్రమ్ ఆయన స్థాపించిన బిఎల్ఎఫ్కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. వ్యక్తిగత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అందరికీ ఈ వేదికపై సమాన అవకాశాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయి.
లిటరేచర్ ఫెస్టివల్ అనేది అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫెస్టివల్లో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. నేను నా రచనలను కొనసాగిస్తా. నా రచనలు ఇంతకుముందులాగే కొనసాగుతుంటాయి. నా గత రచనలకు బాధ్యత వహిస్తా.
నేను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నా దేశం స్వేచ్ఛను ఇచ్చింది. ఎలాంటి భయం లేకుండా దాన్ని వినియోగించుకుంటా. నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా.
నేను ఎంతో ఆసక్తితో స్థాపించిన సంస్థకు నా వ్యక్తిగత అభిప్రాయాలను అంటగట్టి నన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యా. అందుకే సంస్థకు సంబంధించిన అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా.
నిరసన తెలుపున్న రచయితలకు నా హాజరు సమస్యే అవుతుంది. నేను ఇందులో పాల్గొనేందుకు కూడా వారు అంగీకరించరేమో. అందుకే ఫెస్టివల్ నుంచి తప్పుకుంటున్నా. ఇది వారు పాల్గొనేందుకు దోహదపడుతుందని అనుకుంటున్నా. నా, ఇతర వ్యక్తుల కంటే కూడా సంస్థ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని అనుకుంటున్నా. నా వల్ల సంస్థకు చెడ్డ పేరు రావడాన్ని నేను సహించను.
ఫెస్టివల్లో నాతోపాటు ఇప్పటి వరకు పని చేసిన షిన్నీ అంటోనీ, శ్రీకృష్ణ రామమూర్తి, సలహాదారు వి రవిచందర్లు సంస్థను నిర్వాహకులుగా బాగా నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నా. కార్యక్రమంలో నేను ప్యానెల్ లిస్టులో ఉన్నా. ఫెస్టివల్లో నన్ను నిర్వాహకులు మాట్లాడినిస్తే అందుకు నేను సంతోషిస్తా. లేనిపక్షంలో ఇంటి నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తా!
నా చెవుల్లో ఎప్పుడూ జార్జ్ వాషింగ్టన్ చెప్పిన వ్యాఖ్యలు మోగుతూనే ఉంటాయి. అవి ‘'భావ ప్రకటన స్వేచ్ఛాకు విఘాతం కలిగితే.. అక్కడ నిశ్శబ్ధం రాజ్యమేలుతుంది. చావడానికి సిద్ధంగా ఉన్న గొర్రెలాగా'.