చిరుతను చితకబాది చంపిన గ్రామస్థులు
గురుగ్రామ్ గ్రామానికి సమీపంలో మండవర్ గ్రామంలోకి వచ్చిన చిరుత పులిని చంపారు.ఓ యువకుడు సాహసంతో చిరుత మెడను గట్టిగా పట్టుకొంటే మిగతావాళ్లుకర్రలతో దాన్ని కొట్టి చంపారు.
గురుగ్రామ్ :చిరుతపులి అడవిని వదిలి గ్రామానికి వచ్చింది. పులిని చూసిన గ్రామస్థులంతా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తనకు ఎదురు వచ్చిన వారినంతా చిరుత పంజా విసిరి గాయపరిచింది. చిరుత నుండి రక్షించేందుకు క్షణమొక యుగంలా గడిపారు. అయితే ఓక యువకుడు సాహసం చేసి చిరుత మెడను ఉడుంపట్టుతో పట్టుకొంటే మిగతావారు కర్రలతో కొట్టిచంపారు.
డిల్లీ శివారులోని గుర్ గ్రామ్ సమీపంలోని మండవర్ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. ఉదయం ఎనిమిది గంటలకే చిరుతపులి గ్రామంలోకి వచ్చింది.
మూడున్నర గంటలకు పైగా గ్రామంలోనే చిరుత సందడి చేసింది. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిపై దాడి చేసింది. చిరుత ఎక్కడి నుండి వస్తోందో ఎలాతప్పించుకోవాలనే విషయమై గ్రామస్థులు భయపడ్డారు.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు చిరుతపులి గ్రామంలో ప్వైరవిహారం చేసింది.అయితే గ్రామస్థులు చిరుతను ఖాళీ ఇంటిలోకి తరిమారు. ఇంటి మేడపైకి ఎక్కింది చిరుత. అక్కడే ఉన్న ఓ అమ్మాయిపైన తన పంజా విసిరింది. ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తుండగానే అక్కడే ఉన్న యువకుడు చిరుత మెడను గట్టిగా పట్టుకొన్నాడు.
ఇదే అదనుగా భావించిన మరికొందరు కర్రలతో చిరుతపై దాడి చేశారు.దీంతో చిరుత అక్కడికక్కడే చనిపోయింది. ఈ గ్రామానికి సమీపంలోని ఆరావళి పర్వతాల నుండి చిరుతలు తరచూ వస్తుంటాయి.గ్రామంలో అనేక మంది గాయపడడంతో చిరుతను అనివార్యంగా చంపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెప్పారు.