పాపం ఈ గ్రామస్తులు: రాత్రంతా నిద్రమాని కాపలా కాస్తున్నారు..ఎందుకో తెలుసా?
ఔరంగాబాద్: సాధారణంగా ఎవరైనా ఇంట్లో వస్తువుల కానీ, కార్యాలయాల్లో వస్తువులను కానీ దొంగతనం చేస్తారేమోనని కాపలాగా వాచ్మెన్ను పెట్టుకుంటాం. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మాత్రం ఆ గ్రామస్తులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఇంతకీ వారు కాపలా కాసేది ఎందుకు ... ఎక్కడ కాపలా కాస్తున్నారు... దొంగలు ఏమి ఎత్తుకెళుతున్నారని కాపలా కాస్తున్నారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నీటికోసం యుద్ధాలు..రాత్రంతా కాపలా
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని తల్వాడా గ్రామంలో అక్కడి ప్రజలు రాత్రిళ్లు నిద్రమానేసి తమ అమూల్యమైన నిధిని కాపాడే పనిలో పడుతున్నారు. ఇంతకు అది ఏమి నిధి అనేగా మీ డౌటు. వారు నిధికంటే ఎక్కవగా భావించే నీళ్లు దొంగతనానికి గురవుతున్నాయని ప్రతిరోజు రాత్రి మహిళలు పురుషులు చెరువు దగ్గర కాపలా కాస్తున్నారు. తమ చుట్టు పక్క గ్రామాల ప్రజలు నీళ్ల కోసం అక్కడికి వచ్చి తమ నీరును కాజేస్తున్నారని చెబుతున్నారు. ఇలా నీటిని ఇక్కడ దొంగలించి వారి గ్రామాల్లోని పొలాలకు తరలిస్తుండటంతో తల్వాడా గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తుతోందని వాపోతున్నారు.
మా ఊరు మా నీరు అంటున్న గ్రామస్తులు
నీటి దొంగల నుంచి నీరును కాపాడుకునేందుకు గ్రామంలోని ప్రతికుటుంబం నుంచి ఒకరూ లేదా ఇద్దరు రాత్రి అంతా కాపలాగా ఉంటున్నారు. ఆలయ పూజారులు, చర్చి పాస్టర్లు, టైలర్లతో పాటు ఇతరులు కూడా రాత్రి డ్యూటీ చేస్తున్నారు. ఔరంగాబాద్ మాలెగావ్ మధ్యలో ఉన్న ఈ ఊళ్లో 4500 మంది నివసిస్తారు. ఇక్కడి చెరువులో నీరు త్వరగా తరిగిపోతుండటంతో గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ వీరి బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడంతో తమ నీరును తామే కాపాడుకుంటామని శపథం చేసి వారే కాపలాగా ఉంటున్నారు.
వర్షపాతం 50 శాతం తగ్గింది..కరువు కాటేస్తుందేమోనని ఆందోళన
గత వర్షాకాలంతో పోలిస్తే ఈ సారి 50శాతం వర్షపాతం తగ్గిందని చెప్పారు ఆ గ్రామ సర్పంచ్ బాహుసాహెబ్ మగర్. దీనికి తోడు నీటిని చుట్టుపక్కల గ్రామస్తులు దొంగలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలానే మరో నెలరోజుల పాటు కొనసాగితే చెరువు ఎండిపోయి మాకు కానీ పశువులకు కానీ తాగేందుకు చుక్కనీరు మిగలదని ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ . రాత్రి సమయాల్లో మాత్రమే నీటిని దొంగతనం చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పగటి వేళల్లో కరెంటు ఉండదని రాత్రి వేళల్లో కరెంటు ఉండటంతో చుట్టుపక్క గ్రామాల వారు పైపులు వేసి మోటార్లతో తమ పొలాల్లోకి నీటిని పంప్ చేసుకుంటున్నారని వాపోయారు. ఇక తమ నీటివనరులను అధికారులు కాపాడాలని గ్రామస్తులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా తామే చెరువుకు కాపలాగా ఉంటూ నీటిని కాపాడుకుంటున్నామని చెప్పారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని ఇలాంటి నీటి దొంగలకు బుద్ధి చెప్పాలని వారు కోరుతున్నారు.