జై సత్యాగ్రహ: ఈ నదిపై వంతెన కోసం గ్రామస్తుల వినూత్న ప్రదర్శన
బిజ్నోర్ : దేశంలో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో చుట్టు పక్కల గ్రామాల్లోకి వరద నీరు వెళుతోంది. దీంతో అక్కడి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. క్రమంగా పెరుగుతున్న వరదనీటితో కంటిపై కునుకు లేకుండా అక్కడి ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాకు చెందిన 25 గ్రామాల ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు. జై సత్యాగ్రహ అంటూ నినదిస్తూ గంగా నదిపై ఓ వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు నదీతీరం వెంబడి గట్టు కూడా నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం వీరంతా కలిసి ఈ నిరశన కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించేవరకు తాము నిరశన దీక్షను విరమించబోమని తెగేసి చెబుతున్నారు. మోకాలు లోతులో ఉన్న నీటిలో నిలబడి అలానే గంటల తరబడి ఉంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన ప్రజలు జై సత్యాగ్రహ దీక్ష చేపడుతుండటం విశేషం. ఇలా గ్రామస్తులు జలదీక్ష పట్టడంతో ఆ గ్రామంలోని మహిళలకు కూడా వంతెన నిర్మాణం జరుగుతుందనే ఆశ కలుగుతోంది. ఎందుకంటే తమ పశువులకు మేత తీసుకురావాలంటే మహిళలు ఆ నది దాటి అటువైపుగా వెళ్లి మేత తీసుకొచ్చేవారు.
కొన్నేళ్లుగా గ్రామస్తులు వంతెన లేక నరకయాతన పడుతున్నారు. ఇక లాభం లేదని భావించిన గ్రామస్తులు దీక్షకు పూనుకోవాలని పంచాయతీలో నిర్ణయించారు. ఇక ప్రభుత్వం దిగొచ్చేంతవరకు నిరవధికంగా నిరశన కొనసాగిస్తామని ప్రతినబూనారు. దీంతో పోలీసులు కూడా గంగా నదీ తీరం వెంబడి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక గ్రామస్తులకు భారతీయ కిసాన్ యూనియన్ కూడా మద్దతు తెలిపింది. అంతేకాదు బీకేయూ నేతలు రామ్ అవతార్ సింగ్, జిల్లా అధ్యక్షుడు దిగంబర్లు కూడా స్వయంగా నిరశనలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే గంగా నది పొంగి ప్రవహించినప్పుడల్లా వేల ఎకరాలు నీట మునిగిపోతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఇప్పటికే ఏడు గ్రామాల ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం తమ గోస వినిపించుకోవడం లేదని అన్నారు. తమ పొలాలను చేరుకునేందుకు తాత్కాలికంగా ఓ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అయితే బిజ్నోర్ ఆర్డీఓ వారిని కలిసి వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానని హామీ ఇచ్చారు.