బెంగాల్లో మారని తీరు.. తుది విడతలోనూ ఆగని హింస..
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ రోజున బెంగాల్ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఘర్షణలు, దాడులు, కార్యాలయాల దహనాలు కంటిన్యూ అయ్యాయి. బెంగాల్లో 9 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కన్నుకు కన్ను పన్నుకు పన్ను అన్నట్లు తృణమూల్, బీజేపీ పరస్పర దాడులు చేసుకున్నాయి. నాటు బాంబుల మోతతో కొన్ని ప్రాంతాలు దద్దరిల్లాయి.
పంజాబ్కు పాకిన పోలింగ్ హింస: ఒకరి హత్య..పోలీసుల ఫైరింగ్!
తృణమూల్ కార్యాలయానికి నిప్పు
శనివారం టీఎంసీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉన్న భాత్పురాలో తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని దుండగులు దహనం చేశఆరు. బీజేపీ నేత అర్జున్ సింగ్కు గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో ఆయన ఆదేశాల మేరకు కార్యకర్తలు ఈ దారుణానికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఉత్తర 24 పరిగణాల్లోని కటాపుకుర్ ప్రాంతంలో టీఎంసీ అసెంబ్లీ అభ్యర్థి మదన్ మిత్రా కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇటుకలు, నాటు బాంబులు విసిరారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బరాసత్ అభ్యర్థి కోకలి ఘోష్ న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. కేంద్ర బలగాలు జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
టీఎంసీ తీరుపై ఏచూరి ఫైర్
బెంగాల్లో ఉద్రిక్తతలకు తృణమూల్ కాంగ్రెస్ కారణమని సీపీఎం మండిపడింది. డైమండ్ హార్బర్, డమ్ డమ్, నార్త్ కోల్కతాలో టీఎంసీ భారీగా రిగ్గింగ్కు పాల్పడిందని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలు లేనందున అధికారపార్టీ ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఏచూరి డిమాండ్ చేశారు.
దాడులతో సంబంధంలేదన్న టీఎంసీ
బెంగాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసతో తమకెలాంటి సంబంధంలేదని తృణమూల్ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. హింసకు తాము వ్యతిరేకరమని, ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా సాగాలని కోరుకుంటున్నామని ఆ పార్టీ నేత డెరిక్ ఓబ్రెయిన్ ప్రకటించారు. భాత్పరా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ ఉద్రిక్తతలకు కారణమవుతోందని ఆరోపించారు.
ఈసీకి బీజేపీ విన్నపం
బెంగాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఫలితాలు వెలువడే వరకు కేంద్ర బలగాలను కొనసాగించాలని బీజేపీ ఎలక్షన్ కమిషన్ను కోరింది. పోలింగ్ ముగిసిన తర్వాత తృణమూల్ కార్యకర్తలు ఒకవర్గం వారిపై దాడులకు పాల్పడే అవకాశముందని ఈసీ దృష్టికి తెచ్చింది.