జై శ్రీరామ్ అన్నందుకు! పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్త హత్య!
కోల్కత: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస కొనసాగుతూనే ఉంది. జైశ్రీమ్ అని నినదించినందుకు బీజేపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హతుడి పేరు సుశీల్ మండల్. 52 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్ తూర్పు బుర్ద్వాన్ ప్రాంతంలోని పాండుగ్రామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేతుగ్రామ్కు చెందిన సుశీల్ మండల్ బీజేపీలో క్రియాశీలక కార్యకర్త. తన ఇంటిపై ఆయన బీజేపీ పతాకాన్ని తగిలించారు.
దీన్ని గమనించిన కొందరు తృణమూల్ కాంగ్రెస్ కార్యర్తలు బీజేపీ జెండాను తొలగించాలని సూచించారు. జెండాను తీసేయడానికి సుశీల్ మండల్ అంగీకరించలేదు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు మొదలు పెట్టారు. దీనితో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు. కత్తితో దాడి చేశారు. వారి చేతుల్లో తీవ్రంగా గయపడిన సుశీల్ మండల్ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ధర్నాకు దిగారు. ఆందోళన చేపట్టారు. సుశీల్ మండల్ మృతదేహంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొందరు అనుమానితుల పేర్లను వాళ్లు పోలీసులకు అందజేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.