సమస్యలకు హింస పరిష్కారం కాదు: మోడీ, చిరస్మరణీయమన్న రమణ్
దంతెవాడ: ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఛత్తస్గఢ్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం దంతెవాడలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్టీఏ ప్రభుత్వం మారుమూల, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
యువత ఉపాధికి తగిన అవకాశాలు కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఉపాధి ఎంత ముఖ్యమో తనకు తెలుసని, ఉపాధి కల్పిస్తేనే ప్రజలు తమ బిడ్డలను చదివించగలరని, బతకడానికి ఒక నీడ ఏర్పర్చుకోగలరని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వ పథకాల అన్నిటి వెనక ఉపాధి కల్పన తప్పనిసరి అంశంగా ఉంటుందని తెలిపారు. దంతేశ్వరి మాత కృపతో ఇక్కడ నివసించే ఆదివాసీలు ఎలా జీవించవచ్చో ప్రపంచానికి నేర్పించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మొదటిసారిగా రూ. 24వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రూ. 24 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన స్టీల్ ఫ్యాక్టరీకి ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో పర్యటన సందర్భంగా రెండు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా వేలాదిమంది నిరుద్యోగ యువకులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.
నక్సల్స్ సమస్య గురించి బయటపడితే ఛత్తీస్గఢ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంటుందన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు కూడా మానవత్వంతో మారుతారని భావిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో పత్రికల నిండా కుంభకోణాల వార్తలే ఉండేవని.. సంవత్సరం నుంచి అలాంటి వార్తలకు తావు లేకుండా చేశామని ఆయన పేర్కొన్నారు.
చిరస్మరణీయం: రమణ్ సింగ్
దంతెవాడ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇదని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం దంతెవాడలో పర్యటించారు. మోడీ పాల్గొన్న సమావేశంలో రమణ్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి రూ. 24వేల కోట్ల కేటాయించినందుకు, బస్తర్ లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో మెగా స్టీల్ ప్లాంట్ ప్రారంభమైతే 10వేలమందికి పైగా ఉపాధి దొరుకుతుందన్నారు. 2019లోగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు.