కశ్మీర్, పశ్చిమబెంగాల్ లో హింస..! పోలింగ్ కేంద్రంపై గ్రెనేడ్ దాడి..!!
జమ్ముకాశ్మీర్/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. పలు చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నా కశ్మీర్, పశ్చిమబెంగాల్ లలో హింస చోటుచేసుకుంది. కశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగిన పుల్వామాలో (అనంతనాగ్ నియోజకవర్గం) ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా పుల్వామాలోని ఓ పోలింగ్ బూత్ పై ఆగంతుకులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఘటన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దాడులు జరుగుతాయనే భయంలో ఇక్కడ ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం నిర్వహించలేదు. మరోవైపు, ఇక్కడ ఓటింగ్ శాతం రెండంకెల శాతానికి చేరుకోకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇక కోల్ కోతాలో సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బారక్ పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
దాడి అనంతరం ఆయన మాట్లాడుతూ... ఓటర్లతో తాను మాట్లాడుతుండగా తనపై టీఎంసీ వర్గీయులు దాడి చేశారని చెప్పారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని తెలిపారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టీఎంసీ మూకల దాడులకు అంతులేకుండా ఉందని మండిపడ్డారు. రక్తం కారుతున్న తన నోరే దీనికి నిదర్శనమని అర్జున్ సింగ్ చెప్పారు.