బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జ్
రాయ్గంజ్ : బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటన చోటు చేసుకున్నాయి. డార్జిలింగ్ నియోజకవర్గంలోని చోప్రాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమను ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అతను టీఎంసీ కార్యకర్త అయినందున పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర బలగాల పహరాలో పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
బుర్ఖాల మాటున పురుష ఓటర్లు: ప్రతి ఓటరునూ తనిఖీ చేయాలి: బీజేపీ ఎంపీ అభ్యర్థి
ఆందోళనను విరమింప చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీ ఛార్జ్ చేశారు.
ఇదిలా ఉంటే రాయ్గంజ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తృణమూల్ కార్యకర్తలు పోలింగ్ బూత్ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారని, ముస్లిం ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ అభ్యర్థి దేబశ్రీ ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారింది. తృణమూల్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు రాయ్గంజ్ సీపీఎం అభ్యర్థి మొహమ్మద్ సలీం కారును దుండగులు ధ్వంసం చేశారు. తృణమూల్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని సలీం ఆరోపించారు.