పద్మావతిపై వెంకయ్య: ప్రజాస్వామ్యంలో హింసాత్మక బెదిరింపులకు తావు లేదు..
పద్మావతి సినిమాపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ సినిమా పట్ల సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూఢిల్లీ: పద్మావతి సినిమాపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ సినిమా పట్ల సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పద్మావతిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో వెంకయ్యనాయుడు సినిమాకు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ప్రజాస్వామ్యంలో హింసకు, బెదిరింపులకు తావు లేదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, దీపికా పదుకొనేలకు వస్తున్న బెదిరింపులను ఉద్దేశించి పరోక్షంగా వెంకయ్య వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు కొన్ని సినిమాలకు సంబంధించి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని, కొంతమంది ప్రజలు తన మనోభావాలను, మత ఆచారాలను దెబ్బతీసేలా సినిమాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నారన్నారు. సినిమాను వ్యతిరేకించేవాళ్ల ఆందోళనలు శ్రుతిమించిపోతున్నాయని కూడా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా గతంలో నిషేధం ఎదుర్కొన్న సినిమాలు గరమ్ హవా, కిస్సా కుర్సీ, ఆంది సినిమాల గురించి ఆయన ప్రస్తావించారు.
పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, దీపికా పదుకొనేల తల నరకాలని ఇప్పటికే రాజ్ పుత్ కర్ణి సేన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిమా కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటి వాళ్లకు తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆత్మబలిదానం చేసుకున్నవారి గురించి ఏం తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సినిమాను నిలిపేయాలని రాజ్ పుత్ లు, కొంతమంది బీజేపీ సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేస్తుండగా.. వెంకయ్య వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉపరాష్ట్రపతి స్థానంలో ఉండి రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు కాబట్టి, బీజేపీని వెనకేసుకొచ్చే ప్రయత్నం కాకుండా.. బెదిరింపులు తగవంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.