లేటు వయస్సులో ఘాటు ప్రేమ: వృద్ధాశ్రమంలో ఒక్కటైన ప్రేమజంట..ఫోటోస్ వైరల్
కేరళ: ప్రేమకు వయసుతో పనేముంటుంది చెప్పండి. ఆ మాటకొస్తే ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. ప్రేమ ఎలాగైనా ఎలాంటి వ్యక్తిపైన అయినా పుట్టొచ్చు. మనసుతో సంబంధం కానీ శరీరంతో సంబంధం లేనిదే ప్రేమ. ఇందుకు నిదర్శనం ఇప్పుడు మన కథలోని ప్రేమపావురాలే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడే కలిశారు. వారి పరిచయమే పరిణయంగా మారింది. ఇంతకీ ఈ కపుల్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ట్విటర్ వేదికగా మ్యారేజ్ విషెస్
ఆదివారం రోజున ట్విటర్ వేదికగా ఓ కపుల్కు మ్యారేజ్ విషెస్ అందాయి. చాలామంది నెటిజెన్లు ఈ కపుల్ను విష్ చేశారు. ఇంతకీ ఈ కపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..? వీరిద్దరూ లేటు వయస్సులో ఘాటు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది. అంతే ప్రేమకు వయసుతో ఏంటి పని మనసుతోనే పని అంటూ నెటిజెన్లు కామెంట్స్ పోస్టు చేస్తూ ఈ ఓల్డ్ కపుల్ను విష్ చేశారు. ఇక అసలు కథ ఏంటో చూద్దాం.
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. అక్కడే కలిశారు
60 ఏళ్ల వయస్సులో ఆ తాత బామ్మలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరు కలుసుకుంది మాత్రం ఒక వృద్ధాశ్రమంలో. వీరిద్దరూ కలుసుకోవడం, మాటా మాటా మార్చుకోవడం, స్నేహంగా జీవించడం ప్రారంభించారు. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది. ఎంతలా ఉంటే ఉదయాన్నే ఒకరినొకరు చూసుకోకుండా వారి దినచర్యను ప్రారంభించరట. అంతగా డీప్లవ్లో పడిపోయారు. ఇంతకీ ఆ నవయువ ప్రేమికుడి పేరు, మంచి మనసున్న ఆయన ప్రియురాలి పేరు చెప్పలేదు కదూ... అక్కడికే వస్తున్నాం. ఆ ప్రేమికుడి పేరు కొచానియన్ మీనన్, ఆయన ప్రియురాలి పేరు లక్ష్మీ అమ్మాళ్. అయితే ఇక్కడ ఓ ట్విస్టు కూడా ఉందండోయ్...
లవ్ స్టోరీలో చిన్న ట్విస్ట్
ప్రేమికుడు కొచానియన్ మీనన్ కొన్నేళ్ల కిందట లక్ష్మీ అమ్మాల్ తొలి భర్త దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడట. అయితే ఆమె భర్త చనిపోవడంతో కొచానియన్ కూడా పనిమానేసి వేరే చోటుకు వెళ్లిపోయారట. ఇక బామ్మ లక్ష్మీ భర్త చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆమెను వెలేశారు. దీంతో కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ వృద్ధాశ్రమంలో చేరింది. అక్కడే కొచానియన్ మీనన్ను చూసి ఎంతో సంబరపడింది. పాత పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి అతనితో చాలా సన్నిహితంగా మెలిగింది. ఇదే వారి మధ్య ప్రేమను వికసింపజేసింది. ఇంకేముంది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇదే విషయాన్ని వృద్ధాశ్రమంలో ఉన్న ఇతరులకు చెప్పగానే వారు ఆనందంతో అంగీకరించారు.
గ్రాండ్గా జరిగిన పెళ్లి.. హాజరైన రాష్ట్రమంత్రి
అయితే ఈ వివాహ వేడుక మామూలుగా జరగలేదండోయ్. హెన్నా, సంగీత్ కార్యక్రమంతో ప్రారంభమైంది. సంప్రదాయబద్దంగా వివాహ వేడుక జరిగింది. ఇక వీరి ప్రేమకథ కేరళ రాష్ట్ర మంత్రి వీఎస్ శివకుమార్కు తెలిసింది. ఆయన కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ షానవాజ్ కూడా ఈ ఓల్డ్ కపుల్ మ్యారేజ్కు హాజరయ్యారు. ఇక పెళ్లి పీటలపై కూర్చున్న ఈ కొత్త జంట సిగ్గులొలికించారు. సిగ్గుపడుతూ ఇద్దరూ ఒకరి బుగ్గపై ఒకరు ముద్దుపెట్టుకున్నారు. వెంటనే చప్పట్ల మోత ఆ ప్రాంగణమంతా మార్మోగింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. అంతే ఇక నెటిజెన్లు లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఈ దంపతులపై ఆశ్వీర్వచనాలు కురిపించారు. అభినందనలు తెలిపారు.