రైతుల నిరసనలకు అద్దం పడుతున్న వైరల్ ఫొటో: వృద్ధ ‘కిసాన్’ మీద లాఠీ ఎత్తిన యువ ‘జవాన్‘
ఒక వృద్ధడైన సిక్కు రైతు మీద పారామిలటరీ దుస్తుల్లో ఉన్న ఒక పోలీసు లాఠీ ఝళిపిస్తున్న ఈ ఫొటో.. ప్రస్తుతం భారతదేశంలో రైతులు చేస్తున్న ఆందోళనల పరిస్థితికి అద్దం పడుతోంది.
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఓ)కు చెందిన ఫొటోజర్నలిస్ట్ రవి చౌదరి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయ వివాదాలకు కూడా దారి తీసింది.
పోలీసులు ఆందోళనకారులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అయితే, రైతులకు కొట్టలేదని బీజేపీ నాయకులు సమర్థించుకుంటున్నారు.
గత కొద్ది రోజులుగా వేలాది మంది రైతులు దిల్లీని చుట్టుముట్టారు. వ్యవసాయ చట్టాలకు కొత్త సవరణలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ కొత్త చట్టాల వలన రైతులకు నష్టం కలుగుతుందని, ప్రైవేటు వ్యాపారులు తమను దోచుకుంటారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ కొత్త చట్టాలు రైతులకు హాని కలిగించవని ప్రభుత్వం అంటోంది.
- రైతుల నిరసనలు: 'కనీస మద్దతు ధర’ డిమాండును మోదీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదు?
- నరేంద్ర మోదీ: 'కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు కొత్త హక్కులు, అవకాశాలు వచ్చాయి’
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాడ్ చేస్తూ పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల రైతులు దిల్లీకి నడిచి వచ్చారు. వీరిని అడ్డుకోవడానికి వేలాది మంది పోలీస్, పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు.
నిరసనకారులను రాజధాని సరిహద్దుల వద్దే బ్యారికేడ్లతో అడ్డగించారు. దీంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైతులపై వాటర్ క్యానన్లు ఉపయోగించారు.
రైతులు బ్యారికేడ్లు దాటుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణల సందర్భంగా.. గత శుక్రవారం, వాయువ్య దిల్లీలో సింఘు సరిహద్దు వద్ద తెల్ల గడ్డంతో ఉన్న సిక్కు వృద్ధుడిని పారామిలటరీకి చెందిన పోలీస్ లాఠీతో తరుముతుండగా రవి చౌదరి ఫొటో తీశారు.
"పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. రాళ్లు రువ్వారు, బ్యారికేడ్లు బద్దలుకొట్టారు, ఒక బస్సు కూడా దెబ్బతింది" అని ఫొటోజర్నలిస్ట్ రవి చౌదరి, ఫ్యాక్ట్-చెక్ వెబ్సైట్ బూమ్లైవ్.కామ్ (Boomlive.com) కు తెలిపారు.
పోలీసులు నిరసనకారులను కొట్టారని, ఫొటోలో ఉన్న వ్యక్తికి కూడా దెబ్బలు తగిలాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "జై జవాన్, జై కిసాన్" అనే నినాదంతో పాటు ఈ చిత్రాన్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో విపరీతంగా షేర్ చేశారు. సైనికులు, రైతులు దేశానికి ఎంత ముఖ్యమో తెలిపే ఈ నినాదాన్ని 1965లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అందించారు.
https://twitter.com/RahulGandhi/status/1332551079867731968
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ చిత్రాన్ని ట్వీట్ చేశారు.
"ఇది చాలా విచారకరం. మన నినాదం 'జై జవాన్, జై కిసాన్’. కానీ ఇవాళ మోదీ అహంకార వైఖరి రైతుల మీదకు సైనికులను ఉసిగొల్పింది. ఇది చాలా ప్రమాదకరం" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఫొటోలో కనిపిస్తున్నది నిజం కాదని, గడ్డంతో ఉన్న రైతును కొట్ట లేదని, ఇవి అబద్దపు ప్రచారాలని చెప్తూ బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ.. రాహుల్ గాంధీ వాదనను కొట్టిపారేసారు. ఆ రైతును కొట్టలేదనడానికి సాక్ష్యంగా ఒక మూడు సెకెన్ల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
https://twitter.com/amitmalviya/status/1332553047382372352
అయితే, అమిత్ మాలవీయ షేర్ చేసిన వీడియో అబద్దపు వీడియో అని, నిజాన్ని కప్పిపుచ్చడానికి వీడియోను ఈ విధంగా ఎడిట్ చేశారని, ట్విట్టర్ ఈ వీడియోను 'మానిప్యులేటెడ్ వీడియో’ గా గుర్తించిందని అనేకమంది ఎత్తి చూపారు.
బూమ్లైవ్ కూడా మాలవీయ షేర్ చేసిన వీడియో అసత్యమని తిప్పికొట్టింది. అంతే కాకుండా, ఆ వీడియోలో కనిపిస్తున్న రైతు సుఖదేవ్ సింగ్ను గుర్తించి ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది.
"ఒకరు కాదు, ఇద్దరు పోలీసులు తనను కొట్టారని, చేతులకు, కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయని సింగ్ తెలిపారు’’ అని బూమ్లైవ్ ప్రచురించింది. ప్రస్తుతం సుఖదేవ్ సింగ్ హరియాణా-దిల్లీ బోర్డర్ వద్ద ఉన్నారు.
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- రైతుల ఆందోళన: భారత వ్యవహారాలలో కెనడా ఎందుకు జోక్యం చేసుకుంటోంది?
పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన రైతులపై, వయసులో పెద్ద వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించిన చిత్రాలను, శీతాకాలపు చలిలో వాళ్లపై వాటర్ క్యానన్లతో నీళ్లు గుమ్మరించిన ఫొటోలను చూసి భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా అనేకమంది సానుభూతి తెలిపారు.
రైతుల నిరసనల పట్ల భారత ప్రభుత్వ వైఖరికి ఆందోళన వ్యక్తం చేస్తూ "శాంతియుతంగా నిరసనలు తెలియజేసే హక్కును కాపాడడానికి మా దేశం ఎల్లప్పుడూ ముందుటుంది" అని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
కెనడా ప్రధాని వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. "ఇవి అనవసర వ్యాఖ్యలు.. సరైన సమాచారం లేక చేసినవి" అని అభ్యంతరం వ్యక్తంచేసింది.
అయినా కూడా, రైతులు చేస్తున్న నిరసన ప్రదర్శనలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది.
మరోవైపు, కేంద్ర మంత్రులు రైతులను చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం జరిగిన చర్చలు విఫలమవ్వగా, రెండో రౌండ్ చర్చలు గురువారం జరగాల్సి ఉంది.
రైతులు దిల్లీ సరిహద్దుల్లోని అనేక ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని, కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకూ అక్కడినుంచి కదిలేదని స్పష్టం చేసారు.
"సుదీర్ఘ పోరాటానికి సిద్ధమయ్యే వచ్చాం" అంటున్నారు వారు. వంటకు కావాల్సిన సామగ్రి, బియ్యం, ఇతర దినుసులను ట్రాలీలపై మోసుకొచ్చారు.
ఈ పోరాటం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలీదు!
ఇవి కూడా చదవండి:
- 'మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని తర్వాత అర్థమైంది’
- కరోనావైరస్: వ్యాక్సీన్లపై వదంతులు... ఎవరు సృష్టిస్తున్నారు ? ఎలా ఆపాలి ?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- GDP: ఆర్థిక సంక్షోభంలో భారతదేశం... 7.5 శాతం పడిపోయిన జీడీపీ
- GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?
- నివర్ తుపాను తాకిడితో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం
- కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)